ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా గవర్నర్ ప్రసంగం అనంతరం బీఏసీ సమావేశం నిర్వహించారు. గవర్నర్ ప్రసంగం ముగియగానే సభ వాయిదా పడింది. తర్వాత స్పీకర్ అయ్యన్నపాత్రుడు అధ్యక్షతన బీఏసీ సమావేశం నిర్వహించారు. బీఏసీలో అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై చర్చించారు. సమావేశాల అజెండా.. పని దినాల గురించి చర్చించారు. బీజేపీ ఫ్లోర్ లీడర్ విష్ణు కుమార్ రాజు అజెండా అంశాలు పెంచాలని కోరారు. కాగా, మార్చి 21వ తేదీ వరకు సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించగా.. ఈ నెల 28వ తేదీన ఏపీ ప్రభుత్వం 2025-26 వార్షిక బడ్జెట్ను సభలో ప్రవేశ పెట్టనుంది.
శుక్రవారం గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరుగుతుంది. అదే రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమాధానం ఇస్తారు. 26, 27 తేదీల్లో సభకు సెలవు ప్రకటించారు. 28వ తేదీన ప్రభుత్వం 2025-26 వార్షిక బడ్జెట్ను సభలో ప్రవేశ పెడుతుంది. మార్చి 3వ తేదీ నుంచి బడ్జెట్పై చర్చ ప్రారంభమవుతుంది. మార్చి 19వ తేదీతో బడ్జెట్పై అసెంబ్లీలో చర్చ ముగించాలని నిర్ణయించారు. మరో రెండు రోజులు రిజర్వ్ డేస్గా నిర్ణయించారు. అవసరమైతే మార్చి 20, 21 తేదీల్లో సభ నిర్వహిస్తారు.
అసెంబ్లీలో ప్రవేశ పెట్టాల్సిన బిల్లులు, చర్చించాల్సిన అంశాలపై బీఏసీ సమావేశంలో చర్చించారు. అయితే, మరికొన్ని అంశాలపైనా చర్చలు జరపాలని బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు ప్రతిపాదించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ బిల్లులతో పాటు మొత్తం 24 అంశాలను అధికారపక్షం సిద్ధం చేసింది. ఇందులో ప్రధానంగా 8 నెలల ప్రభుత్వ విజయాలు, పోలవరం-బనకచర్ల అనుసంధానం, ప్రజా రాజధాని అమరావతి, రహదారుల నిర్మాణం మరమ్మతులు, ఆర్ అండ్ బి, దావోస్ పర్యటన, పెట్టుబడులు – యువతకు ఉపాధి, స్వర్ణాంధ్ర విజన్ 2047, ఇండస్ట్రియల్ పాలసీ, ఐటీ పాలసీ వంటి అంశాలు ఉన్నాయి. అదే విధంగా గత ప్రభుత్వ వైఫల్యాలకు సంబంధించి కుంభకోణాలు, అటవీ భూములు, మఠం భూములు, రెవెన్యూ భూముల కబ్జా, మద్యం కుంభకోణం, కాకినాడ పోర్టు కుంభకోణం, అటవీ భూముల కుంభకోణం వంటి అంశాలపైనా చర్చించాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. ఇక, రాష్ట్రంలో పెండింగ్ బకాయిలు-చెల్లింపు, వాట్సప్ గవర్నన్స్ మన మిత్ర, ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు చెల్లింపులు, విద్యారంగం బలోపేతానికి చర్యలు, రెవెన్యూ సద స్సులు పరిష్కరించిన అంశాలు వంటి అంశాలు కూడా అసెంబ్లీ సమావేశాల్లో చర్చకు వచ్చే అవకాశం ఉంది. ప్రతీ వారం అయిదు రోజుల పాటు సభ నిర్వహించేందుకు బీఏసీలో నిర్ణయం తీసుకున్నారు.