ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (సీఈఆర్టీ-ఇన్) ఆండ్రాయిడ్ యూజర్లకు మళ్లీ హైరిస్క్ వార్నింగ్ జారీ చేసింది. ప్రధానంగా తాజా ఆండ్రాయిడ్ 15 వెర్షన్ ఉపయోగిస్తున్న యూజర్లు చాలా జాగ్రత్తగా ఉండాలని సీఈఆర్టీ-ఇన్ హెచ్చరించింది. తాజా ఆండ్రాయిడ్ వెర్షన్ లో హ్యాక్ చెయ్యడానికి అనేక అవకాశాలు ఉన్నట్లు ప్రభుత్వ సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీలు కనుగొన్నాయి. ఆండ్రాయిడ్ 15 ఉపయోగించినట్లైతే ఇబ్బందులు తప్పవంటోంది సీఈఆర్టీ-ఇన్. ఆండ్రాయిడ్ 15ని హ్యాకర్లు సులువుగా హ్యాక్ చేయగలుగుతారని అంటున్నారు. సదరు ఆండ్రాయిడ్ ఫోన్లో ఉన్న సమాచారం మొత్తం హ్యాకర్లు తెలుసుకునే అవకాశం ఉండటమేకాకుండా మొత్తం ఫోన్ పనితీరునే నియంత్రించే అవకాశం ఉందని సైబర్ సెక్యూరిటీ వింగ్ గుర్తించింది. ఆఖరికి సెల్ ఫోన్ సర్వీసును సైతం నిరోధించే అవకాశాలు ఆండ్రాయిడ్ 15లో మెండుగా ఉన్నాయి. ఆండ్రాయిడ్ వ్యక్తిగత వినియోగదారులకు, సంస్ధలకు కూడా ఇది ఆందోళన కలిగించే అంశం. ఆండ్రాయిడ్ 12 నుంచి 15 మోడల్ అప్ గ్రేడెడ్ సాఫ్ట్ వేర్ వరకూ ఈజీగా హ్యక్ కి గురయ్యే అవకాశాలు ఉన్నట్లు ప్రభుత్వ ఏజెన్సీలు తమ నివేదికలో పేర్కొన్నట్లు సీఈఆర్టీ-ఇన్ ఎత్తి చూపింది.
సంబంధిత ఆండ్రాయిడ్ కంపెనీలు అప్డేట్లు విడుదల చేసిన వెంటనే యూజర్లు తమ ఆండ్రాయిడ్ పరికరాలను అప్డేట్ చేసుకుంటే హ్యాకింగ్ ను కొంత వరకూ నిరోధించవచ్చని సీఈఆర్టీ-ఇన్ సూచించింది. అలాగే గూగుల్ ప్లేస్టోర్ వంటి విశ్వసనీయ యాప్ స్టోర్ల నుంచే అవసరమైన యాప్ లను ఆండ్రాయిడ్ యూజర్లు డౌన్లోడ్ చేసుకోవాలని సీఈఆర్టీ-ఇన్ సలహాఇచ్చింది. ఆండ్రాయిడ్ పరికరాలు అకస్మాత్తుగా స్ట్రక్ అవ్వడం, బ్యాటరీ డౌన్ అయిపోవడం వంటివి జరిగితే వెంటనే అప్రమత్తమవ్వమని సీఈఆర్టీ-ఇన్ సూచించింది.