ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 2024-25 ఆర్థిక సంవత్సరంలో దేశ వ్యాప్తంగా అత్యుత్తమ ఆర్థిక వృద్ధిని నమోదు చేసిన రాష్ట్రాల సరసన నిలిచింది. స్థిర ధరల ప్రకారం 8.21 శాతం వృద్ధి సాధించి, రాష్ట్రం దేశంలో రెండో అత్యధిక వృద్ధిరేటు కలిగిన రాష్ట్రంగా రికార్డు సృష్టించింది. ఈ గణాంకాలు కేంద్ర గణాంకాల శాఖ ఇటీవల విడుదల చేసిన నివేదికలో వెల్లడయ్యాయి.
ఇందులో తమిళనాడు 9.69 శాతం వృద్ధితో మొదటి స్థానంలో ఉండగా, ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో నిలవడం విశేషం. గత ఆర్థిక సంవత్సరంలో (2023-24) నమోదు చేసిన 6.19 శాతం వృద్ధితో పోల్చితే, ప్రస్తుత వృద్ధి 2 శాతం అధికంగా ఉంది. ఇది రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ వేగంగా అభివృద్ధి పథంలోకి వస్తోందనే సంకేతంగా చెబుతున్నారు.
ప్రస్తుత ధరల ప్రాతిపదికన ఆంధ్రప్రదేశ్ వృద్ధిరేటు మరింతగా పెరిగి 12.02 శాతానికి చేరుకుంది. ఇది ద్రవ్యోల్బణంతో పాటు ఆర్థిక కార్యకలాపాల్లో పెరుగుదల ఉన్నదనీ అర్థం. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు. “ఆంధ్రప్రదేశ్ ఈజ్ రైజింగ్” అని పేర్కొంటూ తన అధికారిక ‘ఎక్స్’ ఖాతాలో పోస్ట్ చేశారు. ఆ మెస్సేజ్లో రాష్ట్ర ప్రజల కృషి, ప్రభుత్వం తీసుకున్న నిర్మాణాత్మక చర్యలే ఈ ఫలితానికి దోహదం చేశాయని చంద్రబాబు పేర్కొన్నారు. గతంలో ఎదుర్కొన్న ఆర్థిక అడ్డంకులను అధిగమిస్తూ రాష్ట్రం ఈ స్థాయికి చేరిందని ఆయన తెలిపారు. భవిష్యత్తులో మరింత అభివృద్ధి కోసం ఐక్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. పాలనలో పారదర్శకత, సమర్థత, ప్రజల భాగస్వామ్యమే ఈ ప్రగతికి ప్రధాన కారణాలుగా పేర్కొన్నారు. ఈ ఆర్థిక వృద్ధి రాష్ట్రానికి భవిష్యత్తులో పెట్టుబడులను ఆకర్షించే అవకాశాలను పెంచుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.