హైదరాబాద్ ఐటీ కారిడార్, సైబరాబాద్ పరిధిలోని హైటెక్ సిటీ, గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ప్రాంతాలు ప్రపంచ స్థాయి ఐటీ కంపెనీలకు కేంద్రాలుగా మారాయి. రోజూ లక్షలాది మంది ఉద్యోగులు ఈ ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తున్నారు. మెట్రో, ఆర్టీసీ సర్వీసులు ఉన్నప్పటికీ, డిమాండ్కు తగినంతగా లేవన్నది అందరూ చెబుతున్న వాస్తవం. దీంతో, చాలా మంది తమ స్వంత వాహనాలు, కంపెనీ క్యాబ్స్, బస్సులు వినియోగిస్తున్నారు.
ఈ పరిస్థితితో రోడ్లపై ట్రాఫిక్ తీవ్రంగా మారుతోంది. దీనిని గుర్తించిన సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు, భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని కొన్ని కీలక మార్గాలలో అండర్ పాస్లు, లింక్ రోడ్లు నిర్మించాలని ప్రణాళికలు రూపొందించారు.
సైబరాబాద్ జాయింట్ సీపీ డాక్టర్ గజారావు భూపాల్, టీజీఐఐసీ ఎండీ డాక్టర్ విష్ణువర్ధన్ రెడ్డి, జీహెచ్ఎంసీ శేరిలింగం పల్లి అధికారులతో జరిగిన సమన్వయ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇందులో రోడ్ల విస్తరణ, ట్రాఫిక్ డైవర్షన్, కొత్త రోడ్ల అభివృద్ధిపై చర్చలు జరిగాయి.
ముఖ్యమైన ప్రతిపాదనలు :
- గచ్చిబౌలి – రాంకీ టవర్స్ నుండి ట్రిపుల్ ఐటీ జంక్షన్ వరకు :
కొండాపూర్ డిఎల్ఎఫ్ సెజ్ మీదుగా రోడ్డు విస్తరణ చేపడితే గచ్చిబౌలి రూట్లో ట్రాఫిక్ క్లియర్ అవుతుందని అధికారులు భావిస్తున్నారు.
- రత్నదీప్ – రహేజా మైండ్ స్పేస్ – టీ హబ్ జంక్షన్ :
ఈ మార్గంలో కొత్త రహదారి నిర్మిస్తే మాదాపూర్ ప్రాంతం నుండి వచ్చే ట్రాఫిక్కి ఉపశమనం లభిస్తుందని అంచనా వేస్తున్నారు.
- టీ హబ్ నుండి ఓఆర్ఆర్ గచ్చిబౌలి మార్గంలో కొత్త అండర్ పాస్ :
దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి మీదుగా వచ్చే ట్రాఫిక్ను గచ్చిబౌలి, కోకాపేట, నానక్ రాంగూడ దిశగా మళ్లించేందుకు ఈ మార్గం ఉపయోగపడనుంది.
- హయత్ – వేవ్ రాక్ (ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్) :
సత్వా నాలెడ్జ్ క్యాపిటల్ నుండి వేవ్ రాక్ వరకు రహదారి విస్తరణ చేయాలన్న సూచనలు వచ్చాయి.
పాదచారులకు ప్రాధాన్యత :
గచ్చిబౌలి, ఐకియా వంటి ప్రాంతాల్లో పాదచారుల భద్రత కోసం అండర్ పాస్లు, ఫుట్ ఓవర్ బ్రిడ్జిల నిర్మాణం చేపట్టాలని ప్రతిపాదించారు. అలాగే ఫుట్పాత్లను పునరుద్ధరించి, పాదచారులకు అనుకూలంగా మార్చాలని నిర్ణయించారు.