- ఉచిత భోజన సౌకర్యంతో పాటు, భజన సంకలనాలు ఉచితం
- ఇస్కాన్ సంస్థతో కలసి భోజన ఏర్పాట్లు, గీతాప్రెస్ సహకారంతో ప్రతుల ముద్రణ
- కోటి మందికైనా ఉచితంగా ఈ పుస్తకాలను పంచాలని అదానీ తలంపు
మహా కుంభమేళాకు తరలి వచ్చే భక్తులకు అదానీ గ్రూప్ సరికొత్త సేవతో స్వాగతం పలుకుతోంది. మహా కుంభమేళా జరిగినన్నాళ్లు ఇస్కాన్ గ్రూప్ తో కలసి భక్తులకు ఉచిత భోజన సదుపాయాలు అందిస్తామని ప్రకటించింది. ఇస్కాన్ గవర్నింగ్ బాడీ ఛైర్మన్ గురు ప్రసాద్ మహారాజ్ ను గౌతమ్ అదానీ కలసి ఈప్రతిపాదన చేసినట్లు తమకు సేవ చేసుకునే భాగ్యం కల్పించమని కోరినట్లు అదానీ గ్రూప్ తెలిపింది. మహాకుంభమేళాలో భక్తులకు ఉచిత భోజనం కల్పించే బాధ్యతను మాతా అన్నపూర్ణ సాక్షిగా తాము తీసుకున్నట్లు గౌతం అదానీ ఆ తర్వాత తన ఎక్స్ ఖాతాలో ప్రకటించారు. కుంభమేళా జరిగిన అన్ని రోజులూ తమ సంస్థ, ఇస్కాన్ కలసి భక్తుల కోసం నాణ్యమైన భోజనాన్ని అందిస్తామని తెలిపారు. అంతేకాదు మేళాకు తరలి వచ్చే భక్తులకు ఉచితంగా హిందూ దేవతల శ్లోకాలు, భజన గీతాలతో కూడిన ఒక పుస్తకాన్ని అందిస్తామని అదానీ గ్రూప్ ప్రకటించింది. దీనికోసం గోరఖ్ పూర్ లోని గీతా ప్రెస్ ను సంప్రదించినట్లు వారి సహకారంతో కోటి పుస్తకాలను ఉచితంగా భక్తులకు అందించాలని సంకల్పించినట్లు అదానీ సంస్థ ప్రకటించింది.