అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టేందుకు సిద్ధమవడమే కాదు.. బాధ్యతలు తీసుకున్న తొలి రోజే సంచలన నిర్ణయాలతో అమెరికాతో పాటు ప్రపంచాన్ని షేక్ చేయాలని చూస్తున్న డొనాల్డ్ ట్రంప్కు షాక్ తగిలింది. ఇప్పటికే ట్రంప్పై అనేక ఆరోపణలు రాగా.. అమెరికన్ మాజీ కాలమిస్ట్ జీన్ కారొల్ను లైంగికంగా వేధించినట్లు నిర్దారణ అయింది. ఈ కేసులో ట్రంప్ను దోషిగా ఫెడరల్ అప్పీల్ కోర్ట్ పరిగణించిది. ట్రంప్పై 5 మిలియన్ డాలర్ల పరిహారం చెల్లించాలని న్యూయార్క్ కోర్టు ఆదేశాలను ఫెడరల్ అప్పీల్స్ కోర్టు సమర్థించింది. దీంతో ట్రంప్కు షాక్ తగిలినట్టైంది.
1996లో ట్రంప్ తనను లైంగికంగా వేధించారు, పరువు తీశారంటూ కారొల్ ఆరోపణలు చేశారు. దీనిపై 9 మంది న్యాయమూర్తుల న్యూయార్క్ జ్యూరీ గతేడాది మే నెలలో ట్రంప్ను దోషిగా తేల్చింది. అత్యాచారం జరిగిందన్న కారొల్ ఆరోపణల్ని జ్యూరీ తోసిపుచ్చింది. దీనిపై ట్రంప్ అప్పీల్కు వెళ్లగా.. ఫెడరల్ కోర్ట్ విచారణ చేపట్టింది. న్యూయార్క్ కోర్ట్ తీర్పులో తప్పిదం ఉందని ట్రంప్ నిరూపించలేకపోయారని, ఆయనకు జరిమానా విధించడాన్ని సమర్తిస్తున్నట్లు తెలిపింది.
ఫెడరల్ కోర్ట్ తీర్పుపై మళ్లీ అప్పీల్కు వెళ్తామన్నారు ట్రంప్ అధికార ప్రతినిధి స్టీవెన్ చెంగ్. భారీ మెజార్టీతో ట్రంప్ను ప్రజలు అధ్యక్షుడిగా ఎన్నకున్నారని, న్యాయవ్యవస్థను రాజకీయ ఆయుధంగా వాడుకునే పద్ధతికి ముగింపు పలికేందుకు అన్ని కేసులు కొట్టేయాలన్నారు.