- వన్ నేషన్ వన్ ఎలక్షన్ జేపీసీలో ప్రియాంకకు చోటు
- టీడీపీ నుంచి హరీష్ బాలయోగి
తొలిసారి ఎంపీగా గెలిచిన ప్రియాంకగాంధీకి అరుదైన అవకాశం రాబోతున్నట్టు తెలుస్తోంది. ఎన్డీఏ సర్కార్ ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన వన్ నేషన్, వన్ ఎలక్షన్ బిల్లుపై ఏర్పాటు కాబోతున్న జాయింట్ పార్లమెంటరీ కమిటీలో కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రియాంకగాంధీకి చోటు దక్కబోతుందని ప్రస్తుతం ప్రచారం జరుగుతోంది. ఏదైనా బిల్లును జేపీసీకి పంపినప్పుడు ఆ బిల్లుపై ప్రభుత్వం ఏర్పాటు చేసే జేపీసీలో ప్రతిపక్ష ఎంపీలకు కూడా చోటు కల్పిస్తారు. ప్రియాంకగాంధీతో పాటు మనిష్ తీవారి, DMK, TMC నుంచి కూడా ఇద్దరు ఎంపీలకు ఈ ప్యానెల్లో చోటు కల్పించే అవకాశం ఉంది.
కాంగ్రెస్ నుంచి ప్రియాంకగాంధీ, సంజయ్, ఎస్పీ నుంచి ధర్మేంద్ర యాదవ్, టీడీపీ నుంచి హరీష్ బాలయోగి, డీఎంకే నుంచి విల్సన్, సెల్వ గగపతి, శివసేన నుంచి శ్రీకాంత్ సిండే, తృణమూల్ కాంగ్రెస్ నుంచి కళ్యాణ్ బెనర్జీ, సాకేత్ గోకలేకు చోటు దక్కింది.
మొత్తం 31 మందితో ఈప్యానెల్ను ఏర్పాటు చేయనున్నారు. మరో మూడు రోజుల్లో ప్యానెల్ సిద్ధంకానుంది. ఈ ప్యానెల్ బిల్లులో ప్రతిపాదించిన సవరణలపై అధ్యయనం చేయనుంది. మొత్తం 90 రోజుల్లో ఈ రివ్యూ పూర్తి చేయాల్సి ఉంటుంది. అయితే ఖచ్చితంగా పూర్తి చేయాలని ఏం లేదు. అవసరమైతే మరింత గడువు కోరే హక్కు ప్యానెల్కు ఉంటుంది. ఇక సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఉన్న బీజేపీ నుంచి ఒకరు ప్యానెల్కు చైర్మన్గా వ్యవహరించనున్నారు.
దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలనే ఉద్దేశంతో కేంద్రం ఈ బిల్లును ఇప్పటికే పార్లమెంట్ ముందుకు తీసుకొచ్చింది. కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జన్రామ్ మేఘ్వాల్ మంగళవారం బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టారు. అనంతరం బిల్లుపై సమగ్ర అధ్యయనం కోసం జేపీసీకి పంపాలని ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనపై లోక్సభ ఓటింగ్ నిర్వహించి జేపీసీకి పంపాలని నిర్ణయించింది.