ఒడిశా అడవుల్లో అరుదైన చిరుత పులి కనిపించింది. అటవీశాఖ ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో చిరుత పులి దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. అయితే, ఆ చిరుత పూర్తి నల్లగా ఉంది. ఈ అరుదైన చిరుతపులి తనకు పుట్టిన చిరుత కూనను నోట కరుచుకొని అడవిలో సంచరిస్తోంది. అటవీ శాఖ ఏర్పాటు చేసిన ఓ సీసీ కెమెరాలో ఈ విజువల్స్ రికార్డ్ అయ్యాయి.
అడవుల్లో సంచరిస్తున్న జంతువులు, వాటి జాతుల వివరాలు, వాటి సంతతి, అటవీ జంతువుల ఆరోగ్యం, జంతువుల బాగోగులు చూడాల్సిన అవసరాలు వంటి వాటికోసం ఫారెస్ట్ అధికారులు అడవుల్లో పలుచోట్ల ట్రాప్ కెమెరాలు బిగిస్తున్నారు. ఆ కెమెరాల్లో రికార్డయిన దృశ్యాలను తరచూ అధికారుల పరిశీలిస్తుంటారు. ఇలా ఆ ట్రాప్ కెమెరాలు పరిశీలిస్తున్న క్రమంలో అధికారులు అవాక్కయ్యారు. వాళ్లకు ఈ కెమెరాల్లో అత్యంత అరుదైన బ్లాక్ పాంథర్ కనిపించింది. అరుదైన ఆ నల్ల చిరుత ఆనవాళ్లు గుర్తించాలని ఫారెస్ట్ అధికారులు ప్రయత్నాలు మొదలుపెట్టారు. అయితే, అధికారుల విశ్లేషణలో అది ప్రత్యేకమైన జాతి కాదని తేలింది. సాధారణ చిరుతపులే అయినా.. మెలనిజం అనే జన్యు లోపం కారణంగా అలా నల్లగా మారిందని అధికారులుచెబుతున్నారు. ఇలా.. ఈ జన్యులోపంతో ఉన్న జంతువులు ఒడిశాలోని మూడు అటవీ డివిజన్లలో ఉన్నాయని నిర్ధారించారు. ఇవి జన్యులోపంతో ఉన్నప్పటికీ వీటికి పుట్టే పులికూనలు మాత్రం సాధారణంగానే ఉంటాయని తెలిపారు.