-
పహల్గాం ఎటాక్ వెనుక వ్యూహం
-
ప్రపంచ వ్యాప్తంగా చర్చ జరగాలన్నదే లక్ష్యం
-
అమెరికా వైస్ ప్రెసిడెంట్ ఉన్న సమయంలో దాడి
-
2000లో క్లింటన్ పర్యటన సమయంలోనూ మారణహోమం
-
ఉగ్రవాదుల ప్లాన్ను పసిగట్టని నిఘా?
జమ్మూకశ్మీర్లోని పహల్గాం వద్ద చోటుచేసుకున్న తాజా ఉగ్రదాడి పట్ల అనేక అనుమానాలు బలపడుతున్నాయి. విదేశీ అతిథుల పర్యటనలను ఉగ్రవాదులు వాడుకుంటున్నాయన్న అభిప్రాయాలు చర్చనీయాంశమయ్యాయి. భారత ప్రధాని నరేంద్ర మోదీ సౌదీ అరేబియాలో పర్యటిస్తుండగా, అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ భార్యతో కలిసి భారత్లో పర్యటనలో ఉన్న సమయంలో ఈ దాడి జరగడం అంతర్జాతీయ మీడియాలో బ్యానర్ ఐటెమ్గా మారింది.
చరిత్ర పునరావృతమవుతోందా?
ఇలాంటి కన్నింగ్ ఉగ్రదాడే 2000 మార్చి 20న జరిగింది. అప్పట్లో అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ న్యూఢిల్లీలో పర్యటిస్తున్న సమయంలో.. అనంత్నాగ్ జిల్లా ఛత్తీసింగ్పొర గ్రామంలో జరిగిన దాడిలో 36 మంది నిరాయుధ సిక్కులను ఊచ కోత కోశారు ఉగ్రవాదులు. చత్తీసింగ్ పొరకు ఉగ్రవాదులు సైనిక వాహనాల్లో వచ్చి తాము ఆర్మీ అని చెప్ అందరినీ నమ్మించారు. ఇళ్లలో ఉన్న పురుషులను మాత్రమే బయటకు రప్పించి, అనంతరం వారిని గురుద్వారాలో నిల్చోబెట్టి వరుసగా కాల్చిచంపారు. పాకిస్తాన్కు చెందిన ఉగ్రవాదులే ఈ దుర్మార్గానికి పాల్పడినట్లు దర్యాప్తులో తేలింది.
పహల్గాం దాడిలో పాత మోడల్?
ఇప్పుడు జరిగిన పహల్గాం దాడిలోనూ భద్రతా దళాల దుస్తుల్లో వచ్చిన ఉగ్రవాదులు పర్యాటకుల ఐడీలను చెక్ చేసి మరీ.. పురుషులను మాత్రమే లక్ష్యంగా చేసుకొని దాడికి పాల్పడ్డారు. ఈ దాడి చేసిన తీరు 2000 ఛత్తీసింగ్పొర దాడిని గుర్తు చేసింది.
రెచ్చగొట్టిన పాక్ ఆర్మీ చీఫ్?
ఈ దాడి వెనక పాకిస్థాన్ పాత్ర ఉండవచ్చన్న అనుమానాలు బలపడుతున్నాయి. ఇటీవల ఓవర్సీస్ పాకిస్థాన్ కన్వెన్షన్లో పాక్ ఆర్మీ చీఫ్ ఆసీమ్ మునీర్ చేసిన వ్యాఖ్యలు ఈ దాడికి ఉసిగొల్పాయన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఆయన ‘కశ్మీర్ మా గొంతులోని రక్తనాళం’ అని, ‘హిందువులతో మనం భిన్నమైనవాళ్లం’ అంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు.. కశ్మీర్లో ఉన్న ముస్లింలు.. వాళ్ల పిల్లలకు పాకిస్తాన్ కథ చెప్పాలని, మన పూర్వీకుల ఆలోచనలను పిల్లల్లోకి ఎక్కించాలని వ్యాఖ్యానించారు.
పాక్ విమానాల తరలింపుతో అనుమానాలు
పహల్గాం దాడికి ముందు పాకిస్థాన్ వాయుసేన రవాణా, నిఘా విమానాలను కరాచీ ఎయిర్ బేస్ నుంచి లాహోర్, రావల్పిండి ఎయిర్ బేస్లకు తరలించింది. దీంతో, పహల్గాం దాడి వెనుక పాకిస్తాన్ ప్రమేయం ఉందన్న అనుమానాలు బలపడుతున్నాయి.