-
శరవేగంగా స్పందించిన కేంద్రం
-
357 వెబ్ సైట్ల బ్లాక్.. గేమింగ్ యాప్స్ పై నిషేధం
-
2,400 బ్యాంకు అక్కౌంట్ల బ్లాక్
-
మూత పడిన 700 ఈ-గేమింగ్ కంపెనీలు
-
సెలబ్రిటీలు ప్రమోట్ చేసినా వాడొద్దని హెచ్చరికలు
-
166 మ్యూల్ అక్కౌంట్ల బ్లాక్.. తప్పుడు URLs బ్లాక్
-
గవర్నమెంట్ రిగ్యులేటెడ్ ఈ- గేమింగ్ యాప్స్ మాత్రమే వాడాలి
-
సద్గురు,మహాకాళ్, అభి247 సంస్థలపై వేటు
-
నకిలీ యాప్స్ తో దేశ భద్రతకు కూడా ముప్పే
ఆన్ లైన్ గేమ్స్ తోపెరుగుతున్న ఆత్మహత్యలు, మోసాలు, ఆర్థిక నష్టాలను దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకుంది.ఎక్కడో విదేశాల్లో ఉంటూ ఆన్ లైన్ ద్వారా గేమ్స్ నిర్వహిస్తున్న దాదాపు 357 వెబ్ సైట్లను బ్లాక్ చేసింది. ఆ గేమింగ్ సంస్థలను నిషేధించింది. దాదాపు 2,400 బ్యాంకు అక్కౌంట్లను నిలిపి వేసింది. దాదాపు 700 ఈ-గేమింగ్ కంపెనీలు దీంతో మూత పడ్డాయి.జీఎస్టీ ఇంటెలిజెన్స్ రాడార్ ఫర్ టాక్స్ ఎవేషన్ కింద వీటన్నింటిని మూసేశారు.పెద్ద పెద్ద సెలబ్రిటీలే ఈ యాడ్స్ ప్రమోట్ చేస్తున్నా ఆ గేమింగ్ యాప్ ల జోలికి పోవొద్దని అధికారులు సలహా ఇస్తున్నారు.
ఉన్నత స్థాయి దర్యాప్తు…పకడ్బందీ చర్యలు
విదేశీ గడ్డపై ఉంటూ ఇక్కడ బెట్టింగ్ ఆన్ లైన్ యాప్స్ ను నిర్వహిస్తూ అమాయకులను నిలువునా ముంచేస్తున్న గేమింగ్ కంపెనీలకు చెందిన 357 వెబ్ సైట్లను జీఎస్టీ ఇంటెలిజెన్స్ అధికారులు బ్లాక్ చేశారు.రకరకాల సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ పై అనేక మంది సెలబ్రిటీలు, క్రికెటర్లు,ఇన్ ఫ్లుయెన్సర్లు ఈ యాప్ లను ప్రమోట్ చేస్తున్నా ఎవరూ వాటి జోలికి పోవొద్దని అధికార్లు సూచించారు.
టాక్స్ కూడా కట్టకుండా ..
చాలా యాప్స్ విదేశాల నుంచి ఆపరేట్ చేసేవి కావడంతో వాటికి ఇక్కడ లైసెన్సులు ఉండవు, జీఎస్టీ చెల్లింపులు చేయవు,టాక్స్ పరిధికి లోబడి ప్రభుత్వానికి చెల్లించాల్సిన మొత్తం కూడా చెల్లించవు.ప్రత్యేకించి ఇలాంటి ఆఫ్ షోర్ గేమింగ్ యాప్స్ అంటే విదేశాలలో ఉంటూ అక్కడ నుంచి ఇక్కడ ఆపరేట్చేసే యాప్ ల జోలికి అస్సలు పోవద్దని, ఎంత పెద్ద సినీ స్టార్లు, ఇన్ ఫ్లుయెన్సర్లు, అభిమాన హీరోలు ప్రమోట్ చేసినా వాటి వలలో పడొద్దని ప్రభుత్వాధికారులు హెచ్చరించారు.
700 కంపెనీలపై వేటు..
దాదాపు 700 ఆఫ్ షోర్ ఈ- గేమింగ్ కంపెనీలను డైరక్టరేట్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ ఇంటెలిజెన్స్ (DGGI) స్కానర్ పరిశీలించింది. ఈ గేమింగ్ కంపెనీలేవీ ఇక్కడ జీఎస్టీ కట్టాల్సి వస్తుందని రిజిస్టర్ కాలేదని, ఇక్కడ కనీసం కట్టాల్సిన టాక్స్ కూడా కట్టడం లేదని, పన్ను పరిధిలోకి రాకుండా తప్పించుకుంటున్నాయని గుర్తించారు. ఈ కంపెనీలలో గేమింగ్ యాప్లను వాడి మోసపోయిన వారు కంప్లయింట్ చేయడానికి కూడా ఏమీ ఉండదు. ఎందుకంటే ఈ యాప్స్ ఏవీ ఇక్కడ రిజిస్టర్ కాలేదు కాబట్టి.
ఈ ఆఫ్ షోర్ కంపెనీలన్నీ తప్పుడు, నకిలీ బ్యాంక్ అక్కౌంట్లను ఓపెన్ చేసి కేవలం డబ్బు లావాదేవీలకు వాడుతుంటాయని కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖ తెలిపింది. అలాంటి 166 నకిలీ, లేదా బురిడీ ఎక్కౌంట్లను బ్లాక్ చేశామన్నారు. ఇప్పటి వరకూ 357 వెబ్ సైట్లు, తప్పుడు URL లింకులు,కంప్లైంట్ చేయడానికి వీలు లేని ఆఫ్ షోర్ ఆన్ లైన్ మనీ గేమింగ్ వ్యవస్థలను కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ సహకారంతో DGGI బ్లాక్ చేసింది.మరో రెండు వేర్వేరు కేసుల్లో DGGI కేంద్ర మంత్రిత్వ శాఖతో కలసి ఉమ్మడిగా 2,400 బ్యాంకు అక్కౌంట్లను బ్లాక్ చేసింది. మరో రూ.126 కోట్ల రూపాయలను ఫ్రీజ్ చేసింది.
ఇకమరో విచిత్రమైన అంశమేమంటే కొందరు మనదేశం వారే విదేశాల్లో ఉంటూ అక్కడనుంచే ఆన్ లైన్ మనీ గేమింగ్ ప్లాట్ ఫామ్స్ నడుపుతున్నారు. సద్గురు ఆన్ లైన్ మనీ గేమింగ్ ప్లాట్ ఫామ్,మహాకాళ్ ఆన్ లైన్ మనీగేమింగ్ ప్లాట్ ఫామ్,అభి 247 ఆన్ లైన్ మనీ గేమింగ్ ప్లాట్ ఫామ్ మ్యూల్ బ్యాంక్ అక్కౌంట్ల ద్వారా (నకిలీ అక్కౌంట్లు) ఇండియన్ కస్టమర్స్ నుంచి సొమ్ము వసూలు చేస్తున్నాయి. DGGI ఇప్పటి వరకూ 166 మ్యూల్ అక్కౌంట్లను బ్లాక్ చేసింది. ముగ్గురు నిర్వాహకులను అరెస్టు చేసింది. మరికొందరు వ్యక్తులపై కేసులు నమోదు చేసి దర్యాప్తు కూడా జరుపుతోంది. జీఎస్టీ చట్టం ప్రకారం ఆన్ లైన్ మనీ గేమింగ్ అనేది గూడ్స్ పరిధిలోకి వస్తుంది.దీనికి 28 శాతం టాక్స్ పడుతుంది. ఈపరిధిలో ఉన్న సంస్థలన్నీ జీఎస్టీ కింద తమ కంపెనీని నమోదు చేయాలి.
ఐపీఎల్ సీజన్ వస్తోంది.. జర భద్రం
ఇక ఐపీఎల్ సీజన్ ఆరంభమవుతుండటంతో టాక్సు అధికారులు ఈ సారి కఠినంగా చట్టాన్ని అమలు చేసి అక్రమంగా గేమింగ్ ఆపరేషన్లన్నింటినీ రద్దు చేస్తారని కేంద్ర మంత్రిత్వ శాఖ తెలిపింది. అందుకే ఈ గేమ్స్ ఆడేవారు రిగ్యులేటెడ్ ఈ- గేమింగ్ ప్లాట్ ఫామ్స్ ను మాత్రమే వినియోగించాలని కోరింది.
విదేశాలనుంచి నడిచే ఆన్లైన్ గేమింగ్ యాప్స్ అనుమతి తీసుకోకపోతే నిజాయితీగా గేమ్స్ జరగవని, స్థానిక వ్యాపారాలకు కూడా ఇది నష్టమేనని, మార్కెట్ ను ఇది దెబ్బతీస్తుందని మంత్రిత్వ శాఖ తెలిపింది. విదేశాలనుంచి నడిచే ఆన్ లైన్ ఈ- గేమింగ్ యాప్స్ రూల్స్ ను ఫాలో కాకుండా ఎప్పటికప్పుడు కొత్త వెబ్ అడ్రస్ లతో రంగంలోకి దిగుతున్నాయని కేంద్రం ఆందోళన వ్యక్తం చేసింది.
ఇది దేశ రక్షణకు కూడా దెబ్బే
కొన్ని కంపెనీలు నకిలీ బ్యాంక్ అక్కౌంట్లతో ఈ గేమింగ్ వ్యవహారాన్ని గుట్టుగా నడుపుతున్నాయని, ఇలా నకిలీ అక్కౌంట్లతో వసూలు చేసిన సొమ్మును డ్రగ్స్ లాంటి నిషేధిత అక్రమ కార్యకలాపాలకు కూడా వాడుతున్నాయని అది దేశ రక్షణను కూడా దెబ్బ తీస్తుందని మంత్రిత్వ శాఖ ఆందోళన వ్యక్తం చేసింది.
సెలబ్రిటీలు, యూట్యూబర్లు, ఇన్ ఫ్లుయెన్సర్లు
అనేక మంది బాలీవుడ్ సెలబ్రిటీలు, క్రికెటర్లు, యూట్యూబ్, వాట్సాప్, ఇన్ స్టా గ్రామ్ ఇన్ ఫ్లుయెన్సర్లు ఇలాంటి నకిలీ గేమింగ్ యాప్స్ ను తెలిసో, తెలీకో ప్రమోట్ చేస్తున్నారు. ఇలా ఆఫ్షోర్ ఆన్ లైన్ గేమింగ్ ప్లాట్ ఫామ్స్ వినియోగించి గేమ్స్ ఆడితే ఆ సొమ్మంతా ఎక్కడకు చేరుతుందో తెలుసుకోవడం కష్టం.పైగా అది వారికి వ్యక్తిగతంగా నష్టమే కాకుండా దేశ విద్రోహ కార్యకలాపాలకు ఉపయోగ పడుతూ మనదేశ ఆర్థిక స్థితిని, రక్షణవ్యవస్థను దెబ్బ తీస్తుందని కేంద్రం హెచ్చరించింది.