హైదరాబాద్లోని టప్పాచబుత్ర దేవాలయంలో జరిగిన అపచారంపై ప్రభుత్వం సీరియస్గా స్పందించింది. దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ ఆదేశం మేరకు హైదరాబాద్ ఓల్డ్ సిటీ టప్పాచబుత్రా జిర్ర హనుమాన్ ఆలయ అపచారం ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. మరోవైపు.. దేవాదాయ ధర్మాదాయ శాఖ ఉన్నతాధికారులు ఆలయంలో సందర్శించారు. ఘటనాస్థలంలో పూర్తి వివరాలు సేకరించి దేవాదాయ శాఖ మంత్రి కార్యాలయంలో నివేదిక అందజేశారు. అంతేకాదు.. ఈ అపచారానికి బాధ్యులైన నిందితులపై ఎఫ్ఐఆర్ నమోదు చేశామని అధికారులు ప్రకటించారు. అలాగే, ఆలయం పరిసర ప్రాంతాల్లో పరిశుభ్రత చర్యలు చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు.
భక్తుల నమ్మకాల విషయంలో తమకు అపార గౌరవం ఉందని.. తమ ప్రజా ప్రభుత్వం ఇటువంటి పనులు చేసే వారిపై చర్యలు తీసుకోవడంలో ఎక్కడా తగ్గేదే లేదని మంత్రి కొండా సురేఖ స్పష్టం చేశారు.
హైదరాబాద్ పాతబస్తీలోని టప్పాచబుత్రలో ఉన్న ప్రఖ్యాత హనుమాన్ ఆలయంలో బుధవారం స్థానికులు మాంసం ముద్దలను కనుగొన్నారు. దీంతో.. ఆలయం వద్ద అక్కడ ఉద్రిక్తత నెలకొంది. ఎప్పటిలాగే ఉదయం నిత్య పూజలు నిర్వహించేందుకు ఆలయానికి వచ్చిన ఆలయ పూజారి మాంసం ముద్దలను గమనించి వెంటనే దేవాలయ కమిటీ సభ్యులకు సమాచారం అందించారు. స్థానికంగా ఈ వార్త వ్యాపించడంతో, ప్రజలు పెద్ద ఎత్తున ఆలయం వద్ద గుమిగూడటం ప్రారంభించారు. విషయం తెలియగానే.. విశ్వహిందూ పరిషత్, స్థానిక బిజెపి కార్యకర్తలు ఆలయం వద్దకు చేరుకున్నారు. గుర్తు తెలియని వ్యక్తులు ఆలయంలోకి మాంసం ముద్దలను విసిరారని నిర్ధారించుకున్నారు. అయితే, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని, సమగ్ర దర్యాప్తు చేపట్టాలని డిమాండ్ చేస్తూ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో గుమిగూడి ఆలయం వద్ద నిరసన తెలిపారు. దీంతో టప్పాచబుత్ర పోలీసులు అప్రమత్తమయ్యారు, పోలీసు బృందాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. సమస్యలు తలెత్తుతాయని ఊహించి పోలీసులు బలగాలను మోహరించారు. క్లూస్ బృందాలు కూడా వచ్చి ఆ ప్రాంతాన్ని క్షుణ్ణంగా పరిశీలించాయి. సీనియర్ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని స్థానిక ప్రజలతో చర్చలు జరిపారు. నిరసన, దృష్ట్యా ఆ ప్రాంతంలోని దుకాణాలు మూసివేశారు. సీనియర్ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు, భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించారు. మంత్రి ఆదేశాలతో ఉన్నతాధికారులు విచారణ చేపట్టడంతో స్థానికులు శాంతించారు.