- తరలి వచ్చిన 50 లక్షల మంది
- యాత్రీకులతో పోటెత్తిన త్రివేణీ సంగమం
- ఈ ఉత్సవం కోసం రూ.7వేల కోట్ల బడ్జెట్
- రూ.4 లక్షల కోట్ల ఆదాయం వస్తుందని అంచనా
- 2019లో అర్ధ కుంభమేళాకు 24 కోట్ల మంది భక్తుల రాక
- విద్యుద్దీప కాంతులతో శోభిల్లుతున్న త్రివేణీ సంగమం
- ఆకర్షణీయంగా టెంట్ సిటీ
- హైందవ విశ్వాసాలకు ప్రతీక అన్న ప్రధాని
లక్షలాది మంది హిందూభక్తులు, స్వామీజీలు, ఆగమశాస్త్ర నిపుణుల మధ్య ఇవాళ ప్రయాగ్రాజ్ లో మహా కుంభమేళా ప్రారంభమైంది. దాదాపు 40 కోట్ల మంది హాజరయ్యే ఈ కుంభమేళా ప్రపంచంలోనే అతిపెద్ద సామూహిక ఆధ్యాత్మిక ఉత్సవంగా భావించవచ్చు. వేద మంత్రోచ్ఛారణల మధ్య దాదాపు 50 లక్షల మంది భక్తులు త్రివేణి సంగమంలో పవిత్ర స్నానాలు ఆచరించారు. మహాకుంభమేళాకు 40 కోట్ల మంది హిందువులు తరలి వస్తారని అంచనాలున్నాయి. ఒకరకంగా చెప్పాలంటే ఇది అమెరికా, రష్యా జనాభాకంటే ఎక్కువ. 12 ఏళ్ల తర్వాత వచ్చిన ఈ కుంభమేళా కోసం 4వేల హెక్టార్లలో ఏర్పాట్లు చేశారు. వచ్చేనెల 26తో ఈ ఉత్సవం ముగుస్తుంది. దేశంలోకే అత్యధిక జనాభా కలిగిన ఉత్తర ప్రదేశ్ కు ఈ మేళా ద్వారా భారీగా రెవిన్యూ వస్తుందని అంచనా. 45రోజుల ఈ మెగా ఉత్సవం కోసం యూపీ ప్రభుత్వం రూ.7వేల కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించింది. దీనివల్ల దాదాపు రెండు లక్షల కోట్ల రూపాయలు వస్తాయని యూపీ సర్కార్ లెక్కగట్టింది. 40 కోట్ల మంది తలా రూ.5వేలైనా ఖర్చు చేస్తారని యూపీ ప్రభుత్వం అంచనావేస్తోంది. అయితే ఇది మినిమం అంచనా అనీ సగటు భక్తుడు ఒక్కొక్కరు రూ. 10 వేల దాకా ఖర్చు చేస్తారని భావిస్తున్నామని అదే జరిగితే రూ.4లక్షల కోట్లు ఆదాయం వస్తుందని మరో సంస్థ లెక్క వేసింది.ఈ మహాకుంభమేళా దాదాపు ఒక శాతం జీడీపీ పెంచుతుందని అంచనా.
అర్ధకుంభమేళాకే 24 కోట్లమంది హాజరు
2019లో జరిగిన ప్రయాగ్ రాజ్ అర్ధకుంభమేళా వల్ల సర్కారీ ఖజానాకు లక్షన్నర కోట్ల రూపాయలు ఆదాయం వచ్చిందని, అప్పట్లో ఈ అర్ధ కుంభమేళాకు 24 కోట్ల మంది యాత్రీకులుతరలి వచ్చారని యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్ తెలిపారు. అర్ధ కుంభమేళాకే అంతమంది వచ్చినప్పుడు పూర్ణ కుంభమేళాకు రెట్టింపు వస్తారని అంచనాలున్నాయని యూపీ ప్రభుత్వ ఖజానాకు ఈ సారి ఆదాయం బాగావస్తుందని సీఎం ఆదిత్యనాథ్ ఆశాభావం వ్యక్తం చేశారు.
టెంట్ సిటీ రికార్డులెన్నో..
మహాకుంభమేళాకు తరలి వచ్చే భక్తులకు ఏర్పాటు చేసిన వసతి సౌకర్యాలతో కూడిన నగరం టెంట్ సిటీ ప్రపంచంలోకే అతిపెద్ద టెంపరరీ సిటీగా రికార్డులకెక్కింది. ఇక్కడ ఒకేసారి 50 లక్షల నుంచి కోటి మంది ప్రజలు సేద దీరవచ్చు. లేదా గుమి కూడా వచ్చు. ఇక అఖిల భారత వాణిజ్య సమాఖ్య లెక్కల ప్రకారం తాగునీరు, బిస్కట్లు, జ్యూస్ లు, భోజనాలు, ప్యాకేజ్డ్ ఫుడ్, కూల్ డ్రింక్స్ లాంటి తిను బండారాల ద్వారా 20వేల కోట్ల బిజినెస్ జరుగుతుందని లెక్క తేలింది. వాణిజ్యరంగం మొత్తం ఆదాయంలో ఇది 20 వేల కోట్ల బిజినెస్ విలువ అనీ అంచనా. యూపీ ప్రభుత్వ ఖజానాకు ఆదాయాన్ని పెంచే మరో వ్యాపారం ఆధ్యాత్మిక రంగానిది. అగరొత్తులు, నూనె దీపాలు, పత్రి, పూలు, భజన పుస్తకాలు, సాంబ్రాణి ధూప్ స్టిక్స్, గంగా జలం, దేవుని ప్రతిమలు ఈ రంగాల్లో అమ్మకాలు ఊపందుకోనున్నాయి. ఈ వ్యాపారం వల్ల కూడా 20 వేల కోట్ల రూపాయలు వస్తాయని ఆర్ధిక నిపుణుల అంచనా.
రవాణా రంగం విషయానికి వస్తే అంతరాష్ట్ర సర్వీసులు, టాక్సీలు, ఇతర వాహనాల వల్ల పదివేల కోట్ల ఆదాయం రావొచ్చు. ఇవే కాక టూర్ గైడ్లు, టూరిజం ప్యాకేజీలు, సంబంధిత కార్యకలాపాల ద్వారా మరో పదివేల కోట్లు ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. టెంపరరీ మెడికల్ క్యాంప్స్, ఆయుర్వేదిక్ మందులు, సోప్స్, మూలికలు గట్రా వ్యాపారం ద్వారా మూడు వేల కోట్లు వస్తుందని అంచనా. ఇక ఈ-టికెటింగ్, డిజిటల్ పేమెంట్స్, మొబైల్ చార్జింగ్, రిపేరింగ్ సెంటర్ల ద్వారా, వైపై సెంటర్ల ద్వారా వెయ్యికోట్ల బిజినెస్ జరుగుతుందని యూపీ అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక ఎంటర్ టైన్ మెంట్ అండ్ మీడియా రంగంలో వాణిజ్య ప్రకటనల ద్వారా పదివేల కోట్ల ఆదాయం సమకూరనుంది.
ఈ రోజు చరిత్రలో పవిత్రమైనది… ప్రధాని
ప్రయాగ్ రాజ్ మహా కుంభమేళా ప్రారంభమైన ఈ రోజు చరిత్రలో ప్రత్యేకమైన రోజు. పరమ పవిత్రమైన రోజు అని ప్రధాని మోడీ తన ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేశారు. కోట్లాది మంది భక్తుల విశ్వాసానికి, తరగని మన సంస్కృతి, సంప్రదాయాలకు చెక్కు చెదరని నిదర్శనమని ఆయన అన్నారు. లక్షలాది మంది భక్తులు తరలి వచ్చి త్రివేణి సంగమంలో పవిత్ర స్నానాలు ఆచరించి భగవంతుని ఆశీస్సులు తీసుకుని వెళుతున్నారని ఇది ఒక చరిత్రాత్మకమైన అద్భుత దినమని అభిప్రాయపడ్డారు. ఈ ఏడాది మహాకుంభ మేళాకు వచ్చే సందర్శకుల కోసం లక్షా 50వేల టెంట్లను, మూడు వేల వంట శాలలను, లక్షా 45 వేల రెస్ట్ రూమ్ లను, 99పార్కింగ్ ప్రదేశాలను ఏర్పాటు చేశారు. భక్త కోటి రాకపోకలను పర్యవేక్షించడానికి, భద్రతా ఏర్పాట్ల కోసం 46 వేలమంది పోలీసులు నిరంతరం సర్వీస్ చేస్తున్నారు. నిఘా కెమెరాలు ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో నిరంతరం పహారా కాస్తున్నాయి. ప్రయాగ్రాజ్ కు దైనందిన రైలు సర్వీసులకు తోడు వంద అదనపు రైళ్లను రంగంలోకి దించారు. ఈ రైళ్లు 3,300 ట్రిప్పులు తిరిగి భక్తుల రాకపోకలకు సాయపడుతున్నాయి. ఈ మహాకుంభమేళాకు 15 లక్షల మంది విదేశీ టూరిస్టులు వస్తారని కేంద్ర టూరిజం మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తెలిపారు. మహాకుంభమేళా కోసం నిర్మించిన టెంట్ సిటీ ఈసారి చరిత్రాత్మకంగా నిలుస్తుందని యూపీ అధికారులు అంటున్నారు.