- టెంట్ల బుకింగ్కి అధికారిక వెబ్ సైట్లనే వినియోగించండి
- ప్రయాణ తేదీ, రిటర్న్ జర్నీ ముందే నిర్ణయించుకోండి
- ఎక్కువ లగేజీ క్యారీ చేయకండి..
- హెల్త్ రిపోర్ట్స్,ఎమర్జెన్సీ కాంటాక్ట్ నెంబర్లు దగ్గరుంచుకోండి
- హెచ్ ఎంవీపీ వైరస్ నేపధ్యంలో మాస్క్ ధరించడం మంచిది
మహా కుంభమేళాకు వెళ్లాలనుకున్నవారు ముందుగా అక్కడ ఏర్పాట్లు చేసుకోవడం మంచిది.అక్కడ ఉండేందుకు వసతి సౌకర్యాలు,భోజన సదుపాయాలు, వెళ్లేందుకు తగిన రైలు సౌకర్యాలకోసం ప్రభుత్వ అధికారిక వెబ్ సైట్లను వినియోగించి బుక్ చేసుకోండి. అధికారిక ఐఆర్ సీటీసీ వెబ్ సైట్ www.irctctourism.com లేదా, ప్రభుత్వ వెబ్ సైట్ kumbh.gov.in.లో అన్ని వివరాలు ఉన్నాయి.
టెంట్ సౌకర్యం…
సాధారణంగా అందుబాటు ధరలోనే టెంట్లు అద్దెకు దొరుకుతాయి. మన బడ్జెట్ ను బట్టి ఒక రాత్రికి రూ.1500 మొదలు కొని రూ.35 వేల వరకూ లగ్జరీ సూట్లు కూడా దొరుకుతున్నాయి.
ఏ తేదీన ఫిక్స్ చేసుకోవాలి…
విశేష ఘడియలైన ఈనెల 14,29, ఫిబ్రవరి 3వ తేదీన రష్ చాలా ఎక్కువగా ఉండే అవకాశముంది.కాబట్టి మీ ప్రయాణ తేదీలను ముందే నిర్ణయించుకోండి.
పేమెంట్ ఇలా చేసుకోండి…
ఇప్పుడు చెప్పిన వెబ్ సైట్ల ద్వారా మీ స్లాట్ డేట్ ముందే ఫిక్స్ చేసుకుని అందుకు తగిన పేమెంట్ను ఆన్ లైన్ లోనే చెల్లించండి. అందుకు తగిన రసీదు తీసుకోవడం మర్చిపోవద్దు. భక్తుల తాకిడిని దృష్టిలో ఉంచుకుని ఎంత ముందుగా బుక్ చేసుకుంటే అంత మంచిది. చెకిన్, చెకవుట్ డేట్లతో పాటు ఎంతమంది వెళుతున్నారు? ఎన్నాళ్లు ఉంటారు అన్నవిషయాల్లో కూడా క్లారిటీగా బుక్ చేసుకోవాలి. నగదు చెల్లింపులు క్రెడిట్ ,డెబిట్ కార్డుల ద్వారా లేదా యూపీఐ మోడ్ లోనూ జరపవచ్చు. బుకింగ్ పూర్తి కాగానే మీకు మెయిల్ కు లేదా మొబైల్ కు ఎస్సెమ్మెస్ ద్వారా అయినా కన్ఫర్మేషన్ రావాలి. మోసపూరిత వెబ్ సైట్లను ఆశ్రయించవద్దు.
మహా కుంభమేళాలో పాటించాల్సిన జాగ్రత్తలు…
ముందుగానే ప్రయాణ తేదీలు రాకపోకలను నిర్ణయించుకోండి. అధికారిక వెబ్ సైట్ లో ఆ డేట్లలో అవైలబిలిటీ చెక్ చేసుకోండి. వెంట తగినంత తక్కువ లగేజీ ఉండేలా చూసుకోండి. భారీ లగేజీతో అనవసర ఇబ్బందులు పడొద్దు. తగినన్ని దుస్తులు, చలి తట్టుకునే స్వెటర్లతో పాటు, అత్వసర మందులు వెంట ఉంచుకోండి. దగ్గరలోని ఆస్పత్రులు, ఎమర్జెన్సీ సర్వీసులపై అవగాహన పెంచుకోండి. ఎమర్జెన్సీ కాంటాక్ట్ నెంబర్లు వెంట ఉంచుకోవాలి. గుర్తింపు పొందిన స్థలాలలోనే దిగండి. అధికారిక ఘాట్లలోనూ, టాయిలెట్ సౌకర్యాలను సరిగా చూసుకోండి. లక్షల్లో భక్తులు పోటెత్తే ప్రదేశం కాబట్టి పరిసరాల పరిశుభ్రత అందరి బాధ్యత అని మసలుకొండి. చెత్త, వేస్టేజ్ ను డస్ట్ బిన్లలో మాత్రమే వేయండి. ప్రభుత్వాధికారులు ఎప్పటికప్పుడు మైకుల్లో ఇచ్చే సూచనలు ఫాలోకండి. మేళా ఆర్గనైజర్లకు సహకరించండి. బాధ్యతాయుతంగా మసలుకొండి. మీ వస్తువుల పట్ల ఎప్పటికప్పుడు నిఘా ఉంచుకోండి. దొంగలుంటారు. వస్తువులు పోగొట్టుకోకుండా కాపాడుకోవాలి. ఒకవేళ ఏదైనా వస్తువు పోతే సమీప కేంద్రంలో ఫిర్యాదు ఇవ్వండి.
చేయకూడని పనులు…
మహాకుంభమేళాకు భారీ లగేజ్ తీసుకెళ్లద్దు. విలువైన బంగారు ఆభరణాలు, పెద్ద మొత్తంలో నగదు తీసుకెళ్ల కూడదు. అలాగే వెంట ఉన్న క్రెడిట్, డెబిట్ కార్డులను పదిలపరచుకోవాలి. ఎక్కడపడితే అక్కడ ఏది పడితే అది తినకండి. ఎంపిక చేసిన నాణ్యమైన ఆహార తయారీ కేంద్రాల దగ్గరే ఫుడ్ ఆర్డర్ చేయండి. లక్షలమంది తరలి వచ్చే పుణ్యప్రదేశం కాబట్టి ఎవరికీ ఇబ్బంది కలిగించకుండా మౌనంగా మసలుకోవాలి. నదిలో స్నానం ఆచరించండి తప్ప మరే ఇతర కానుకలు, పువ్వులు, బట్టలు ప్రసాదాలు జారవిడవకండి. నీటిని కలుషితం చేయకండి. సబ్బులతో స్నానాలు, బట్టలు ఉతకడం లాంటి పనులు చేయకూడదు. అధికారులు చూపిన స్నాన ఘట్టాల్లో మాత్రమే స్నానాలు చేయాలి. వెళుతున్నది మహా జాతరను తలపించే ప్రాంతానికి కాబట్టి మీరు పూర్తి ఆరోగ్య వంతులైతేనే ప్రయాణం చేయండి. లేదంటే మీ ద్వారా అనారోగ్యం ఇతరులకు వ్యాపించే ప్రమాదముంది. అంతేకాదు ప్రస్తుతం హెచ్ఎంపీవీ వైరస్ వ్యాప్తిలో ఉంది కాబట్టి మాస్కులు వాడటం అన్ని విధాల శ్రేయస్కరం. ప్లాస్టిక్ బ్యాగుల వినియోగం నిషేధించారు కాబట్టి అలాంటి సంచులు తీసుకెళ్లకండి. ఈజాగ్రత్తలన్నీ పాటిస్తే మీ తీర్ధయాత్ర వందశాతం ప్రశాంతంగా పూర్తవుతుంది.