- బకాయిల చెల్లింపునకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆమోదం
- అప్పులున్నా ఇచ్చామనేబిల్డప్ లపై నెట్టింట ట్రోలింగులు
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిలో సరికొత్త రాజకీయ నాయకుడు కనిపిస్తున్నాడు. ఇంతకుముందు ఉద్యోగుల బకాయిలు ఇవ్వడానికి, ఫీజు రీయంబర్స్ మెంట్లు ఇవ్వడంలో వెనుకడుగు వేసే ఆయన ఈసారి సంక్రాంతి కానుకగా రూ.6,700 కోట్ల బకాయిలు విడుదల చేసి రికార్డ్ సృష్టించారు. దీంతో ఉద్యోగ వర్గాలు, పోలీసులు, రైతులు, చిన్న గుత్తేదార్లు, విద్యార్థులు అందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దీంతో లక్షల మంది ఇళ్లల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసంలో ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్, ఇంకా ముఖ్యమంత్రి కార్యాలయ ఉన్నతాధికారులు పలువురితో చంద్రబాబు సుదీర్ఘ సమయం చర్చించారు. ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితులు, అప్పులు, తిప్పలు అన్నీ సమావేశంలో చర్చకు వచ్చాయి. అయినా వాటన్నింటిని అధిగమించి సీఎం చంద్రబాబు బకాయిలు విడుదల చేశారు.
ఈ విషయాలను ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్ విలేకరుల సమావేశం తెలియచేస్తూ, రాష్ట్ర ఆర్థికపరిస్థితులు, బాధలు, ఇలా కష్టాలన్నీ ఏకరువు పెట్టారు. అయితే ఎన్నేళ్లు చంద్రబాబు సీఎంగా చేసినా, అదే స్ట్రాటజీ ప్రయోగించడంపై నెట్టింట మీమ్స్ వస్తున్నాయి. ఎందుకంటే ఇస్తూ కూడా.. ఆ బీద అరుపులు ఎందుకు? అక్కడేదో బీరువాలో సొంత డబ్బులు తీసిస్తున్నట్టు బాధపడతారెందుకు? అని ట్రోలింగులు వస్తున్నాయి.
ఇకపోతే ప్రభుత్వానికి కష్టాలున్నాయని ఆర్థికమంత్రి అన్నారు. అయితే అగ్రరాజ్యం అమెరికాలో కూడా కష్టాలున్నాయి. లాస్ ఏంజిల్స్ మొత్తం తగలడిపోయింది..ఒకవైపునుంచి మంచు కురుస్తోంది. అటు చైనాలో కొత్త వైరస్ మళ్లీ ప్రపంచాన్ని వణికిస్తోంది. దీంతో ఆ దేశంపై తీవ్ర ఒత్తిడి ఉంది. పాకిస్తాన్ కి ఒక తరహా కష్టాలున్నాయి, అన్నింటికి మించి మన దేశంలో ప్రధాని మోదీకి తలనొప్పులున్నాయి.
ఇలా చూసుకుంటే ప్రతి రాష్ట్రంలో రకరకాల సమస్యలున్నాయి. ఒక ఆంధ్ర ప్రదేశ్ కే కష్టాలు రాలేదని, దీనినేదో బూతద్దంలో చూపిస్తూ, చేసే ప్రయత్నాలు, ఓల్డ్ టెక్నిక్కులను ఆపేయమని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. వాళ్లకివ్వాల్సిన డబ్బులిస్తూ కూడా సానుభూతి కొట్టేయాలని చూడటం, ఇన్ని అప్పులున్నా పాపం చంద్రబాబు ఇచ్చాడనే బిల్డప్ లు ఆపమని నెటిజన్లు సీరియస్ గానే వ్యాఖ్యానిస్తున్నారు.