- సొంతూళ్లకు చేరుకుంటున్న ప్రజలు
- హైదరాబాద్-విజయవాడ హైవేపై రద్దీ
- కిక్కిరిసిన రైళ్లు, బస్సులు
- ప్రైవేటు బస్సుల్లో అడ్డగోలుగా ఛార్జీలు
సంక్రాంతి సందడి మొదలైపోయింది. ఏపీలోని పలు ప్రాంతాలకు హైదరాబాద్ వాసులు ఉత్సాహంగా పరుగులు తీస్తున్నారు. ఇప్పటికే రైళ్లన్నీ కిక్కిరిసిపోయి ఉన్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఆర్టీసీ స్పెషల్ బస్సులను తిప్పుతున్నారు. రైల్వేస్టేషన్లు, బస్టాండ్లలో ఇసకేస్తే రాలనంత జనం ఉన్నారు. బ్యాగులతో, పిల్లాపాపలతో ఇంటిళ్లపాది సొంతూళ్లకు బయలుదేరారు.
హైదరాబాద్- విజయవాడ హైవేపై వేలాది వాహనాలు ట్రాఫిక్ లో చిక్కుకున్నాయి. చౌటుప్పల్ వద్ద ఫ్లై ఓవర్ లేకపోవడంతో వాహనాలు బారులు తీరి నిలిచిపోయాయి. ఇక పంతంగి చెక్ పోస్టు వద్దయితే 50 మంది పోలీసులను మోహరించారు. వారు దగ్గరుండి వాహనాలను వెంటవెంటనే పంపిస్తున్నారు.
శనివారం నుంచి పిల్లలకు సెలవులు ప్రకటించడంతో ఒకేసారి ప్రజలు ఉప్పెనలా బయలుదేరారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉభయగోదావరి జిల్లాల ప్రజలు, ఇంకా తిరుపతి, ఒంగోలు, కర్నూలు, చిత్తూరు తదితర ప్రాంతాల ప్రజలు దూరాభారం ఫీలవుతున్నారు. వాళ్లకు దగ్గర దగ్గర 12 గంటల నుంచి 20 గంటల ప్రయాణ సమయం ఉంటుంది.
విజయవాడ, మచిలీపట్నం, గుంటూరు తదితర ప్రాంతాలకు 7 లేదా 8 గంటలు పడుతుంది. అయితే ట్రాఫిక్ కష్టాల వల్ల వీరి ప్రయాణం మరింత పెరిగిపోవడంతో చిన్నపిల్లలు, మహిళల పరిస్థితి వర్ణణాతీతంగా ఉంది. అయితే ఏడాదికి ఒకసారి సొంతూళ్లకు వెళ్లేవాళ్లు ఇవేవీ తమకు పెద్ద ఇబ్బందులు కావని చెబుతున్నారు. సంతోషంగా ఇళ్లకు వెళుతున్నట్టు చెబుతున్నారు.
సందట్లో సడేమియాలో ప్రైవేటు ట్రావెల్స్ బస్సులు ఛార్జీలను అడ్డగోలుగా పెంచేశారు. వీటిమీద ప్రభుత్వాలకు నియంత్రణ లేకపోవడంతో వారు ఆడింది ఆట, పాడింది పాటగా ఉంది. ఉదాహరణకి మామూలు రోజుల్లో కాకినాడ నుంచి హైదరాబాద్ కు రూ.1000-1200 స్లీపర్ బస్సు ఛార్జ్ ఉంటుంది. అదే పండుగ రోజుల్లో రూ.3000-4000 పైనే విక్రయిస్తున్నారని అంటున్నారు.
అయితే రెండు రాష్ట్రాల ఆర్టీసీలు స్పెషల్ బస్సుల పేరుతో ఛార్జీల బాదుడు మొదలెట్టారని, ఇదే సమయంలో అందినంత దోచుకుంటున్నారనే విమర్శలున్నాయి. మొత్తానికి సంక్రాంతి పేరు చెప్పి ఎవరి గోల వారిదన్నట్టు ఉంది.