ప్రజలకు సుపరిపాలన అందించాలన్నదే సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం లక్ష్యమని పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు అన్నారు. తెలంగాణా డిపార్ట్ మెంట్ ఆఫ్ ఎలక్ర్టానిక్స్ సర్వీసెస్ డెలివరీ(ఈఎస్డీ) రూపొందించిన ఈ మీ టికెట్ యాప్ ను శ్రీధర్ బాబు గురువారం సచివాలయంలో లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ టెక్నాలజీ సాయంతో పౌర సేవలను ప్రజల ముంగిటకు చేరవేస్తున్నామన్నారు. ఈ ప్రక్రియలో సంబంధిత నిపుణులను భాగస్వాముగా చేస్తున్నామని అన్ని రకాల టికెట్ బుకింగ్స్ ను ఒకే ప్లాట్ ఫాంపైకి తెచ్చేందుకు వీలుగా ఈ యాప్ ను రూపొందించామని తెలిపారు. రాబోయే రోజుల్లో ఇలాంటి తరహా యాప్ లను మరిన్ని అందుబాటులోకి తీసుకొస్తామని శ్రీధర్బాబు ప్రకటించారు. ఈ యాప్ లో తెలంగాణలోని 15 ప్రముఖ దేవాలయాలు, 129 పార్కులు, 54 బోటింగ్ ప్రదేశాలు, జూ, మెట్రో, ఆర్టీసీ, మ్యూజియాలు, ప్లే అండ్ ఎంటర్ టైన్ మెంట్ జోన్స్ కు సంబంధించిన టికెట్లను తీసుకోవచ్చుని మంత్రి వివరించారు. జీహెచ్ఎంసీ పరిధిలోని కమ్యూనిటీ హాళ్లు, జిమ్ లు, స్పోర్ట్ కాంప్లెక్స్ లను బుకింగ్ చేసుకోవచ్చు. మీరు ఎంచుకున్న లొకేషన్ కు సమీప ప్రాంతాల్లోని చూడదగిన ప్రదేశాలుంటే.. ఆ సమాచారం కూడా యాప్ లో ఆటోమేటిక్ గా కనిపిస్తుందని తెలిపారు. ఈ యాప్ను చాలా సులువుగా వినియోగించుకోవచ్చని, యూపీఐ ద్వారా చెల్లింపులు చేయోచ్చని మంత్రి చెప్పారు. ఇతర ప్లాట్ ఫాంల మాదిరిగా ఈ యాప్ లో అదనంగా ఎలాంటి ఛార్జీలను వసూలు చేయమని వివరించారు. కార్యక్రమంలో మీ సేవ కమిషనర్ రవి కిరణ్, పరిశ్రమల శాఖా కమిషనర్ డా.జి.మల్సూర్, జూపార్క్స్ డైరెక్టర్ డా.సునీల్, తదితరులు పాల్గొన్నారు.