తిరుపతి విష్ణు నివాసం తొక్కిసలాట ఘటనపై ప్రభుత్వం సీరియస్సుగా తీసుకుంది. రాత్రికి రాత్రే ముగ్గురు మంత్రులతో కూడిన బృందాన్ని తిరుపతి వెళ్లాల్సిందిగా మంత్రులు ఆనం, అనిత, అనగానిలను ఆదేశించారు సీఎం చంద్రబాబు. సీఎం ఆదేశాలతో ముగ్గురు మంత్రులు తిరుపతికి బయలు దేరారు. తొక్కిసలాట ఘటన స్థలాన్ని పరిశీలించడంతో పాటు.. ఘటనకు కారణమెవరనే దానిపై తిరుపతి వెళ్లిన వెంటనే ఆరా తీయనున్నారు మంత్రుల బృందం. అలాగే ఆస్పత్రిలో బాధితులకు అందుతున్న చికిత్సను పరిశీలించాలని మంత్రుల బృందాన్ని ఆదేశించారు సీఎం చంద్రబాబు. అధికారుల మధ్య సమన్వయ లోపం కారణంగానే తిరుపతిలో తొక్కిసలాట ఘటన జరిగిందని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చినట్టు సమాచారం. తిరుపతి ఘటనపై చంద్రబాబు నియమించిన మంత్రుల బృందం.. తొక్కిసలాట ఘటనతో పాటు.. వైకుంఠ ఏకాదశి ఉత్సవాల సందర్భంగా శ్రీవారి దర్శనం కోసం భక్తులకు టీటీడీ చేసిన ఏర్పాట్లను పరిశీలించనుంది. అవసరమైతే వైకుంఠ ఏకాదశి దర్శనాలు ముగిసే వరకు తిరుపతిలోనే మంత్రుల బృందం ఉండే అవకాశం కన్పిస్తోంది.
- Advertisement with us -