- రైల్వేకి కొత్తగా 18వ జోన్
- విశాఖ చేరుకున్న ప్రధాని మోదీ
- నేడు జాతికి అంకితం
ఆంధ్రప్రదేశ్ ప్రజల చిరకాల కోరిక నెరవేరే సమయం ఆసన్నమైంది. విశాఖపట్నంలో కొత్త రైల్వేజోన్ సౌత్ కోస్ట్ రైల్వే (ఎస్ సీవోఆర్) ప్రధాన కార్యాలయానికి ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేసి జాతికి అంకితం ఇవ్వనున్నారు. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం భారీ బహిరంగ సభ ఏర్పాటుచేసింది. ముందుగా విశాఖలో రూ.149 కోట్లతో నిర్మించనున్న కొత్త రైల్వే జోన్ కి ప్రధాని శంకుస్థాపన చేసిన అనంతరం, అనకాపల్లి జిల్లాలో పూడిమడక దగ్గర ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ హబ్, కృష్ణపట్నం పారిశ్రామిక పార్క్, 6 రైల్వే ప్రాజెక్టులు, 3 రైల్వే లైన్లు, నక్కపల్లి దగ్గర బల్క్ డ్రగ్ పార్క్, 10 రోడ్డు నిర్మాణ విస్తరణ ప్రాజెక్టులు, ఇంకా చెన్నై-బెంగళూరు పారిశ్రామిక వాడలో క్రిస్ సిటీ అభివృద్ధికి ఇలా పలు ప్రారంభోత్సవ, శంకుస్థాపనలు జరగనున్నాయి.
కొత్తగా 18వ రైల్వే జోన్
ఏపీలో కొత్త రైల్వే జోన్ ఏర్పాటులో భాగంగా విశాఖను రెండు భాగాలు చేయనున్నారు. అందులో కొంత భాగం 18వ కొత్త జోన్ లో అంటే సౌత్ కోస్ట్ రైల్వేలో చేర్చే అవకాశాలున్నాయి. ఈ భాగాన్ని పక్కనే ఉన్న విజయవాడలో విలీనం చేస్తారు. ఇక విశాఖలో మిగిలిన భాగాన్ని ఒరిస్సాలోని రాఘగడ్ లోని ఈస్ట్ కోస్ట్ రైల్వే ప్రధాన కార్యాలయంలో చేర్చుతారు. ఇంక ఆపరేషన్స్ అన్నీ అలాగే జరుగుతాయి.
ఇప్పుడు 18వ రైల్వే జోన్ సౌత్ కోస్ట్ రైల్వే ప్రధాన కార్యాలయాన్ని విశాఖలో నిర్మిస్తున్నారు. దీని గొడుగు కిందకు ఏపీలో ఉన్న రైల్వే డివిజన్లు విజయవాడ, గుంటూరు, గుంతకల్ ఇవన్నీ కలుస్తాయి. ఇప్పుడెక్కడ నుంచి వచ్చే ఆదాయం అక్కడే ఖర్చు చేసే అవకాశాలున్నాయి. దీంతో ఏపీలోని రైల్వే అద్భుతంగా అభివృద్ధికి చెందే అవకాశాలున్నాయి. ఆర్థికంగా నవ్యాంధ్ర తిరిగి పుంజుకునేలా కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న చేయూతపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.