– వణికిస్తోన్న HMPV వైరస్
– కరోనా పరిస్థితులు గుర్తు తెచ్చుకుంటోన్న జనం
– ఇప్పటికే దేశంలో ఐదు కేసులు గుర్తింపు
– భయం వద్దని భరోసా ఇస్తోన్న కేంద్రం
– HMPV వైరస్ పాతదే అంటోన్న ప్రభుత్వం
– ఆందోళన అవసరం లేదంటోన్న ఐసీఎంఆర్
దేశంలో మళ్లీ భయాలు అలుముకున్నాయి. కరోనా నాటి పరిస్థితులు అందరికీ గుర్తొస్తున్నాయి. ఎందుకంటే.. చైనాలో కొంతకాలంగా ఎక్కువవుతోన్న హ్యూమన్ మెటా నిమో వైరస్ కేసులు మన దేశంలోనూ నమోదవుతున్నాయి. ఇప్పటికే దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఐదు కేసులు నమోదయ్యాయి. దీంతో అంతటా భయాందోళన నెలకొంది. అయితే, హెచ్ఎంపీవీ వైరస్పై ఆందోళన అవసరం లేదని ఐసీఎంఆర్ కోరుతోంది. ఈ వైరస్ పాతదేనని, ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే వ్యాప్తిలో ఉన్న వైరస్ అని ఐసీఎంఆర్ స్పష్టం చేసింది. అంతేకాకుండా.. మన దేశంలో ఇన్ ఫ్లూయెంజా, శ్వాసకోశ వ్యాధుల లాంటి కేసులు అసాధారణ రీతిలో లేవని స్పష్టత ఇచ్చింది. ఒకవేళ వైరస్ వ్యాప్తి చెందినా దాన్ని ఎదుర్కొనేందుకు అవసరమైన ఎక్విప్ మెంట్ మన దగ్గర ఉందని ఐసీఎంఆర్ భరోసా ఇస్తోంది. పేర్కొంది.
మనదేశంలో ఇప్పటివరకు హ్యూమన్ మెటానిమోవైరస్ -హెచ్ఎంపీవీ కేసులు 5 రికార్డయ్యాయి. కర్నాటకలో 2, తమిళనాడులో 2, గుజరాత్ లో ఒక్కటి చొప్పున వైరస్ కేసులు నమోదయ్యాయి. వైరస్ సోకిన 3 నెలల పాప కోలుకుని ఇప్పటికే డిశ్చార్జ్ కాగా.. మిగతా వాళ్లకు ఆస్పత్రుల్లో చికిత్స అందిస్తున్నారు. అయితే, హెచ్ఎంపీవీ వైరస్ వ్యాప్తిపై ఆందోళన చెందాల్సిన అవసరం అస్సలే లేదని ఐసీఎంఆర్ తెలిపింది. ఈ వైరస్ పాతదేనని ఇప్పటికే ఇండియాతో సహా ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తిలో ఉందని స్పష్టం చేసింది. హెచ్ఎంపీవీ వైరస్ వ్యాప్తిపై నిరంతరం మానిటరింగ్ చేస్తున్నామని తెలిపింది. ఈ కొత్త వైరస్ను ఎదుర్కొనేందుకు అవసరమైన వైద్య సామాగ్రి మన దగ్గర ఉందని పేర్కొంది.
మరోవైపు.. కర్నాటకలోని బెంగళూర్లో రెండు హెచ్ఎంపీవీ కేసులను ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ గుర్తించిందని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. బ్రాంకో నిమోనియాతో బాధపడుతున్న 3 నెలల పాపను బెంగళూరులోని బాప్టిస్ట్ హాస్పిటల్లో అడ్మిట్ చేయగా హెచ్ఎంపీవీ పాజిటివ్గా గా నిర్ధారణ అయిందని, అయితే, ఆ పాప కోలుకుని ఇప్పటికే డిశ్చార్జ్ అయిందని కూడా తెలిపింది. ఇక, బ్రాంకో నిమోనియాతోనే బాధపడుతున్న 8 నెలల బాబును కూడా బాప్టిస్ట్ హాస్పిటల్ లోనే చేర్పించగా.. ఈ నెల 3వ తేదీన హెచ్ఎంపీవీ పాజిటివ్ గా నిర్ధారణ అయ్యిందని, ప్రస్తుతం ఆ బాబు కోలుకుంటున్నాడని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఈ పిల్లల తల్లిదండ్రులకు ఇంటర్నేషనల్ ట్రావెల్ హిస్టరీ లేదని కూడా తెలిపింది. అలాగే, గుజరాత్లోని అహ్మదాబాద్లో 2 నెలల బాబుకు హెచ్ఎంపీవీ పాజిటివ్గా రిపోర్ట్ వచ్చింది.