బీజేపీకి మహిళలంటే కనీస గౌరవం లేదని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖా మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఓ ప్రకటనలో విమర్శించారు. ఢిల్లీలోని కల్కాజీలో రోడ్ల గురించి చెబ్తూ ప్రియాంకా గాంధీని అవమానించేలా మాట్లాడిన బీజేపీ అభ్యర్థి రమేశ్ బిధూరి చేసిన అంసదర్భ వ్యాఖ్యలను ఆయన ఖండించారు. ‘దేశం కోసం గాంధీ కుటుంబం ఎన్నో త్యాగాలు చేసింది. ఒక్కసారి చరిత్రలోకి వెళ్లి చూడండి. వారి గొప్పతనం ఏంటో మీకు తెలుస్తుంది. అలాంటి కుటుంబానికి చెందిన వ్యక్తుల గురించి సంస్కరహీనంగా మాట్లాడం ఎంత వరకు సమంజసమో బీజేపీ నాయకులు ఆత్మ పరిశీలన చేసుకోవాలి.
రికార్డు మెజారిటీతో ప్రజలు ఎన్నుకున్న ఓ మహిళా ఎంపీపై అభ్యంతకర వ్యాఖ్యలు చేయడమంటే.. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే. భారతీయ సమాజంలో మహిళలకు గొప్ప స్థానముంది. భారతీయ సంస్కృతిని పరిరక్షించేది తామే అంటూ గొప్పలు చెప్పుకునే బీజేపీ నాయకులు బిధూరి చేసిన వ్యాఖ్యలకు ఏం సమాధానం చెబుతారు’ అంటూ ప్రశ్నించారు. ఇప్పటికైనా బీజేపీ నాయకులు తీరు మార్చుకోవాలని… మీడియాలో ప్రచారం, సంచలనాల కోసం గాంధీ కుటుంబంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయోద్దంటూ హితవు పలికారు. ఒక మహిళను గౌరవించలేని బిధూరికి టిక్కెట్ ఎందుకిచ్చారో బీజేపీ అగ్రనేతలు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.