రాష్ట్రంలో మిగులు విద్యుత్తో తెలంగాణ దేశంలోనే ఆదర్శప్రాయంగా నిలుస్తోందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చెప్పారు. ఈనెల 9వ తేదీన న్యూ ఎనర్జీ పాలసీని ప్రకటిస్తామని, దేశ, విదేశీ పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా కొత్త ఇంధన పాలసీని రూపొందించామని ఆయన చెప్పారు. రాష్ట్ర సచివాలయం ఎదురుగా ఉన్న రాజీవ్గాంధీ విగ్రహం వద్ద జెన్కో కొత్తగా ఉద్యోగాలు పొందిన ఏఈలకు ఉద్యోగ నియామక పత్రాలు అందజేసే కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి హాజరైన విక్రమార్కకు..ప్రభుత్వ సలహాదారులు కేశవరావు, ఇంధనశాఖ కార్యదర్శి సందీప్కుమార్ సుల్తానియా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద పూలమాలలు వేసి ఆయన ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ గడిచిన పదేళ్లలో పాత ప్రభుత్వం కొత్త ఎనర్జీ పాలసీని రూపొందించలేకపోయిందని ఆరోపించారు. తమ ప్రజా ప్రభుత్వం 2030 నాటికి 22,448 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి ప్రణాళికలు తయారు చేస్ందన్నారు. 20,000 మెగావాట్ల గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తికి ప్రణాళికలు రూపొందిస్తుందని చెప్పారు. ఒరిస్సా నైనీ కోల్ బ్లాక్ వద్ద థర్మల్ పవర్ ప్రాజెక్టు ఏర్పాటుకు కసరత్తు చేస్తున్నామన్నారు. రామగుండంలో జెన్కో – సింగరేణి సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో పవర్ ప్రాజెక్ట్ ఏర్పాటుకు ముందుకు వెళుతున్నామని చెప్పారు. రాష్ట్ర జిఎస్డిపిలో ఎనర్జీ ప్రధాన పాత్ర పోషిస్తుందన్నారు. నిమిషం కూడా అంతరాయం లేకుండా గత సంవత్సరం నుంచి నాణ్యమైన విద్యుత్తును రాష్ట్రవ్యాప్తంగా సరఫరా చేస్తున్నామన్నారు. కాంగ్రెస్ పాలనలో కరెంటు లేకుండా పోతుందని సోషల్ మీడియాలో బీఆర్ఎస్ చేసిన ప్రచారాన్ని ప్రజలు విశ్వసించలేదని భట్టి గుర్తు చేశారు. ఖమ్మంలో ఇటీవల సంభవించిన వరద విపత్తుల్లో ప్రజలకు కరెంటు అంతరాయం లేకుండా అర్థ రాత్రులు కూడా వరద నీటిలో, వర్షం పడుతున్నా లెక్కచేయకుండా విధులు నిర్వహించిన విద్యుత్ ఉద్యోగులకు, సిబ్బందికి అభినందనలు తెలియజేశారు.