తెలంగాణకు గర్వకారణంగా సేవలందిస్తోన్న సింగరేణి సంస్థను దేశవ్యాప్తంగా విస్తరిస్తామని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క చెప్పారు. సివిల్స్ ఇంటర్వ్యూలకు ఎంపికైన వారికి ఆర్థిక సాయం అందించడం గర్వకారణమన్నారు. ఇంటర్వ్యూలు జరిగే సమయంలో ఢిల్లీలో వసతి కూడా కల్పిస్తామని తెలిపారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా సివిల్స్ వైపు రాష్ట్ర యువతను మళ్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి పక్షాన ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు భట్టి విక్రమార్క. సివిల్స్ ఇంటర్వ్యూలకు ఎంపికైన అభ్యర్థులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క లక్ష రూపాయల చొప్పున చెక్కులను అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత పాలకులు సింగరేణిని వ్యక్తిగత, రాజకీయ అవసరాలకు వాడుకున్నారని, తాము మాత్రం సింగరేణిని ప్రపంచంలోనే మేటి సంస్థగా నిలబెట్టాలనుకుంటున్నామని చెప్పారు. కార్మికుల సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ ప్రమాదంలో చనిపోయిన కార్మిక కుటుంబానికి కోటి రూపాయలకు పైగా ఉచిత ప్రమాద బీమా అందిస్తున్నామని భట్టి గుర్తు చేశారు. సింగరేణిలో నిరుపయోగంగా ఉన్న ప్రాంతాల్లో సోలార్, పంపు స్టోరేజ్ ద్వారా గ్రీన్ పవర్ ఉత్పత్తి చేస్తామన్నారు. ప్రపంచవ్యాప్తంగా కాలుష్య రహితంగా విద్యుత్ ఉత్పత్తికి గ్రీన్ పవర్ వైపు వెళ్తున్న పరిస్థితి ఉందన్న డిప్యూటీ సీఎం.. బొగ్గుపై ఆధారపడే పరిస్థితి తగ్గి ఆ గనులు మూతపడే పరిస్థితి ఏర్పడే అవకాశం ఉందన్నారు. ఈ నేపథ్యంలో ముందుచూపుతో సింగరేణిని మైనింగ్ రంగాల్లో దేశవ్యాప్తంగా విస్తరించే ఆలోచనలో ప్రభుత్వం ఉందన్నారు. ప్రతి దశలోనూ ఒక్కొక్కరికి లక్ష రూపాయల ఆర్థిక సాయం అందిస్తామని చెప్పారు. అంది వచ్చిన అవకాశాన్ని తెలంగాణ యువత అందిపుచ్చుకోవాలని డిప్యూటీ సీఎం సూచించారు. ఇంటర్వ్యూకు ఎంపికైన 20 మంది సివిల్స్ తుది పరీక్షలో విజయం సాధిస్తే రాష్ట్రానికి కావాల్సింది అంతకన్నా ఏమీ లేదన్నారు. ఇంటర్వ్యూకు ఎంపికైన వారికి ఢిల్లీలో వసతి సౌకర్యాలు కూడా కల్పిస్తామని డిప్యూటీ సీఎం చెప్పారు. సింగరేణి రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థికంగా బలమైన సంస్థ అని భట్టి విక్రమార్క కొనియాడారు.