కృత్రిమ మేధ (ఏఐ), ఆధునిక సాకేతికతలో గ్లోబల్ హబ్ గా హైదరాబాద్ విస్తరిస్తోందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వెల్లడించారు. ప్రతిభావంతులైన మానవ వనరులు, అద్భుతమైన మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉన్నందున కొత్త సంస్థలు సిటీ వైపు ఆసక్తి కనబరుస్తున్నాయని అన్నారు. ఆదివారం నాడు కృత్రిమ మేధ ఆధారిత సేవలు, క్లౌడ్ కంప్యూటింగ్, డేటా డెలివరీలో అగ్రగామి సంస్థల్లో ఒకటైన ‘డేటా ఎకానమీ’ నూతన వర్క్ స్టేషన్ ను ఆయన హైటెక్ సిటీలో ప్రారంభించారు. క్వాంటమ్ కంప్యూటింగ్, డిజిటల్ ట్విన్స్, డేటా బదిలీ రంగాల్లో ఈ సంస్థ గణనీయ పురోగతిని సాధించడం సంతోషంగా ఉందని శ్రీధర్ బాబు తెలిపారు. ప్రభుత్వ పరంగా సంస్థ విస్తరణకు తమ వంతు సహాయం అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు. తాము ప్రారంభించిన యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ నైపుణ్యం ఉన్న మానవ వనరులను పరిశ్రమకు అందిస్తుందని ఆయన వెల్లడించారు. ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలకు సాఫ్ట్ వేర్ సంస్థలు విస్తరించాలని కోరుకుంటున్నట్టు మంత్రి తెలిపారు. స్టార్ట్ అప్ కంపెనీలు, ఏఐ, క్వాంటమ్ కంప్యూటింగ్ కేంద్రాలు, డేటా సెంటర్లు పెద్ద ఎత్తున ఏర్పాటవుతున్నందున యువతకు ఉపాధి అవకాశాలు మెరుగవుతాయన్న ఆశాభావం వ్యక్తం చేసారు. తాము నెలకొల్పే ఏఐ సిటీ అభివృద్ధిలో ‘డేటా ఎకానమీ’ భాగస్వామి కావాలని ఆయన కోరారు. వచ్చే ఏడాది చివరి నాటికి హైదరాబాద్ కేంద్రంలో మరో 500 మంది కొత్త ఉద్యోగులను నియమిస్తామని ‘డేటా ఎకానమీ’ ప్రతినిధులు మంత్రికి వివరించారు. కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు రవి కోపురి, జవహర్, రోషన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.