పాకిస్థాన్ ఎయిర్ఫోర్స్ దూకుడుపై ఉంది. ఏకంగా అఫ్ఘానిస్థాన్పై ఎయిర్స్ట్రైక్స్ చేసింది. ఈ దాడుల్లో మహిళలు, పిల్లలు సహా 25 మంది మృతి చెందినట్లు సమాచారం. మంగళవారం రాత్రి ఈ దాడులు జరిగాయి. మొత్తం ఏడు గ్రామాలను టార్గెట్ చేసుకొని ఈ దాడులు జరిగినట్టు తెలుస్తోంది. ఈ దాడులపై తాలిబన్ ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. పాకిస్థాన్ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని వార్నింగ్ ఇచ్చింది.
అయితే ఈ దాడులను పాకిస్థాన్ ఆర్మీ కానీ, ప్రభుత్వం కానీ అధికారికంగా ధ్రువీకరించలేదు. కానీ తాలిబాన్ రహస్య స్థావరాలపై దాడులు జరిపినట్టు మాత్రం కొందరు అధికారులు అంగీకరిస్తున్నారు. కానీ చనిపోయిన వారంతా సాధారణ ప్రజలే అని తెలుస్తోంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది.
పాకిస్తాన్, అఫ్ఘానిస్తాన్ మధ్య కొంత కాలంగా ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. సరిహద్దుల్లో అలజడి రేపేందుకు తాలిబాన్లు ప్రయత్నిస్తున్నారని పాకిస్థాన్ ఆరోపిస్తోంది. నిజానికి గత కొన్ని రోజులుగా పాకిస్థాన్ ఆర్మీపై దాడులు జరుగుతున్నాయి. వీటిని చేసేది తెహ్రిక్-ఈ-పాకిస్థాన్ తాలిబన్ అనే సంస్థ. దీంతో పాక్ సైన్యం వీరిపై ఉక్కుపాదం మోపుతోంది. దీంతో చాలా మంది సభ్యులతో పాటు.. అఫ్ఘానిస్తాన్ నుంచి వలస వచ్చిన వారిని పాకిస్థాన్ తరిమి కొడుతోంది. అయితే వీరికి తాలిబన్లు సరిహద్దుల్లో ఆశ్రయం కల్పిస్తున్నారు. ఇప్పుడు పాక్ ఆర్మీ వారినే టార్గెట్ చేసుకుంది. అయితే అసలైన ఉగ్రవాదులకు బదులు సామాన్య ప్రజలపై దాడులకు పాల్పడింది పాక్ ఎయిర్ఫోర్స్. ఈ దాడులతో ఇరు దేశాల సరిహద్దుల్లో ఉద్రిక్తతలైతే మరోసారి పెరిగాయనే చెప్పాలి.