సంధ్యా ధియేటర్ తొక్కిసలాటపై పోలీసులు చేసిన వీడియో చూసి అల్లు అర్జున్ కొంత భావోద్వేగానికి గురయ్యారు. మంగళవారం విచారణ నిమిత్తం హాజరైన అల్లు అర్జున్ని చిక్కడపల్లి పోలీసులు దాదాపు మూడున్నర గంటల పాటు విచారించారు. పోలీసులు మొత్తం 18 ప్రశ్నలు అల్లు అర్జున్ని అడగ్గా అందులో 15 ప్రశ్నలకు ఆయన సమాధానాలు చెప్పినట్లు తెలిసింది. మిగిలిన వాటికి తనకు తెలియదని, ధియేటర్ లోపల చీకటిగా ఉన్నందున తనకు ఏమీ అర్ధం కాలేదని పోలీసులకు చెప్పినట్లు సమాచారం. తన వల్ల కొన్ని తప్పులు జరిగినట్లు అల్లు అర్జున్ ఒప్పుకున్నట్లు చెపుతున్నారు. విచారణకు ఎప్పుడు పిలిచినా హాజరవుతానని పోలీసులకు అల్లు అర్జున్ చెప్పినట్లు తెలిసింది. విచారణ సమయంలో తన వాహనంలో ఉన్న డ్రైఫ్రూట్స్, బిస్కెట్స్ తిని టీ తాగినట్లు సమాచారం. ఇదిలా ఉండగా సంధ్యా దియేటర్ తొక్కిసలాట కేసులో పుష్పా-2 సినిమా నిర్మాతలను కూడా చేరుస్తూ మొత్తం 18 మందిపై చిక్కడపల్లి పోలీసులు కేసులు నమోదు చేశారు. A1, A2లుగా ధియేటర్ యజమానులు అగమాటి పెదరామిరెడ్డి, అగమాటి చిన్నరామిరెడ్డి, A3, A4, A5, A6, A7, A8లుగా ధియేటర్ భాగస్వాములైన ఎం.సందీప్, సుమిత్, అగమాటి వినయ్, అశుతోశ్రెడ్డి, రేణుకాదేవి, అరుణారెడ్డి, A9గా ధియేటర్ మేనేజర్ నాగరాజు, A10గా లోయర్ బాల్కానీ ఇన్చార్జ్ విజయ్చందర్, A11గా పుష్ప హీరో అల్లు అర్జున్, A12గా అల్లు అర్జున్ పీఏ సంతోష్, A13గా అల్లు అర్జున్ మేనేజర్ శరత్బన్నీ, A14, A15లుగా భద్రతా సిబ్బంది రమేశ్, రాజు, A16గా ఫ్యాన్స్ అసోసియేషన్ కి చెందిన వినయ్ కుమార్, A17గా బాడీగార్డ్ ఫర్వేజ్, A18గా మైత్రీ మూవీస్ ప్రొడ్యూసర్లను నమోదు చేశారు.