పుష్ప ప్రీమియర్ షో సమయంలో జరిగిన సంఘటన దురదృష్టకరమని తెలంగాణ FDC చైర్మన్ దిల్ రాజు ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటివి సినిమా ఇండస్ట్రీ లో అప్పుడప్పుడు అనుకోకుండా జరుగుతాయన్నారు.
అమెరికా పర్యటన ముగించుకుని హైదరాబాద్ చేరుకున్న దిల్ రాజు ఈ రోజు కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ ను పరామర్శించారు. శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితిని వైద్యలను అడిగి తెలుకుకొన్నారు, కుటుంబ సభ్యులతో దిల్ రాజు మాట్లాడారు. దిల్ రాజు రేవతి కుటుంబానికి అన్ని రకాలుగా అండగా ఉంటామని భరోసా కల్పించారు. అవసరమైతే రేవతి భర్త భాస్కర్కు ఇండస్ట్రీలో పర్మినెంట్ ఉద్యోగం కల్పిస్తామని హామీ ఇచ్చారు.
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అపాయింట్మెంట్ కోరామని రేపు లేదా ఎల్లుండి ముఖ్యమంత్రిని కలుస్తామని ఫిల్మ్ డెవలప్మెంట్ ఛైర్మన్, నిర్మాత దిల్ రాజు తెలిపారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్తోను సమావేశమవుతానన్నారు. ప్రభుత్వానికి, సినిమాకి వారధిలా ఉండాలని నన్ను FDC చైర్మన్ గా నియమించారన్నారు.
అమెరికాలో వేరే ప్రోగ్రాంలో ఉన్నానని, నిన్న ఇండియాకు వచ్చానన్నారు. ఇవ్వాళ రాగానే సిఎం రేవంత్ రెడ్డిని కలిశానన్నారు. రేవతి భర్త భాస్కర్ ఏదోక జాబ్ ఏర్పాటు చేస్తామని, వాళ్ల బాధ్యత తాను తీసుకుంటానని వెల్లడించారు.
FDC ద్వారా వీరికి ఏవిధమైన సహకారం అందించగలిగితే అవి అందిస్తామని, ప్రభుత్వానికి ఇండస్ట్రీ కి మధ్యలో ఉండి… భాస్కర్ కుటుంబానికి న్యాయం చేస్తానని భరోసా ఇచ్చారు. శ్రీ తేజ ఆరోగ్యం కుదుట పడుతోందని, సిఎం ఆదేశాల మేరకు ఇక్కడికి రావడం జరిగిందని పేర్కొన్నారు.
సిఎం రేవంత్ తో కూడా వీరి బాధ్యత తీసుకోవడంపై చర్చించగా సీఎం సానుకూలంగా స్పందించారన్నారు. ఇటువంటివి జరగటం దురదృష్టకరమని, ఎవ్వరూ కావాలని చెయ్యరని దిల్ రాజు అన్నారు.
దిల్ రాజు రాగానే సీన్ మారిపోయినట్టు కనిపిస్తోంది. ప్రభుత్వానికి, అల్లు అర్జున్ కు సయోధ్య దిశగా దిల్ రాజు చొరవ తీసుకున్నారని సమాచారం. పుష్ప వ్యవహారంతో సినీ పరిశ్రమకు ప్రభుత్వానికి మధ్య సంబంధాలు జఠిలమవుతున్నాయి.
వెంకటేష్ హీరోగా సంక్రాంతికి వస్తున్నారు, రామ్ చరణ్ హీరోగా గేమ్ చేంజర్ సినిమాలకు దిల్ రాజు నిర్మాత కాగా.. బాలక్రష్ణ హీరోగా వస్తున్న డాకు మహారాజ్ సినిమాకు డిస్ట్రిబ్యూటర్ గా ఉన్నారు. ఈ సినిమాలన్నీ సంక్రాంతికి సందడి చేసేందుకు సిద్దంగా ఉన్నాయి.
ఈ తరుణంలో పుష్ప వ్యవహారం బెనిఫిట్ షోల రద్దు దిల్ రాజు సినిమాలపై ఆర్థికంగా భారీ ప్రభావం చూపనుంది. మరోవైపు తెలుగు సినీ పరిశ్రమ ఆంధ్రప్రదేశ్ కు తరలిరావాలని అక్కడి నేతలు కొందరు పిలుపు ఇచ్చారు. వీటన్నింటికి పుల్ స్టాప్ పెట్టే దిశగా ఎఫ్ డి సి చైర్మన్ దిల్ రాజు పావులు కదుపుతున్నారని సినీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.