- హడలి పోయిన జనం
- నిష్క్రమణకు ముందు విన్యాసం
ముంబైలో ఎయిర్ ఇండియా బోయింగ్ 747 గాలి లో విన్యాసాలు చేయడంతో స్థానికులు హడలి పోయారు. విమానానికి ప్రమాదం జరుగుతోందేమో అని బెంబేలెత్తి పోయారు. జంబో విమానం టేకాఫ్ కు ముందు గాల్లోకి లేవగానే ఓ పక్కకు వంగి కొద్ది సేపు..ప్రయాణించడం, మళ్లీ కిందకు డైవ్ చేయడం, మళ్లీ అంతలోనే మరో పక్కకు వంగి కొంత దూరం ప్రయాణించడం, గాల్లోనే పల్టీలు కొట్టినట్లు చేయడం తో విమానం కూలిపోతోందని అంతా భ్రమించారు. అయితే చివరకు విషయం తెలుసుకుని ఊపిరి పీల్చుకున్నారు.
ముగిసిన బోయింగ్ 747 సీరీస్ ప్రస్థానం
ఇంతకీ విషయం ఏంటంటే.. మన దేశంలో బోయింగ్ 747 జంబో సీరీస్ లో నాలుగు అతిపెద్ద విమానాలకు కాలం చెల్లడంతో ప్రభుత్వం వాటిని ఎర్ సేల్ అనే యూఎస్ ఎయిర్ క్రాఫ్ట్ బ్రోకర్ కి అమ్మేసింది. ఆ సీరీస్ లో ఆఖరుది చివరిది అయిన బోయింగ్ 747 నిన్న చివరి టేకాఫ్ చేసింది.
అల్విదా బోయింగ్ 747
విమానం గాల్లోకి ఎగరగానే ముందు కుడి వైపు కు వంగింది.. ఆ తర్వాత మళ్లీ ఎడమ వైపుకు ఒంగింది. ఆ తర్వాత డైవ్ చేసింది. ఆపై మళ్లీ పైకి లేచింది. వింగ్ వేవ్ అనే ఈ విన్యాసాన్ని ఎంతో చేయి తిరిగిన పైలట్లు, సీనియర్లు మాత్రమే చేయగలరు. ఒక విమానం రిటైర్ అయ్యే ముందు చివరి సారిగా గాల్లోకి ఎగిరి ఇలా సెండాఫ్ చేయడం పరిపాటి. అయితే దీనిని ఎంతో నిపుణులైన పైలట్లు మాత్రమే చేస్తారు. బోయింగ్ 747 ఇలాంటి విన్యాసాలు చేసిన అనంతరం గాల్లోకి దూసుకు పోవడంతో ఎయిర్ పోర్టు చుట్టు పక్కల స్థానికులు ఏం జరుగుతోందో తెలీక కంగారు పడ్డారు. ఆందోళన పడ్డారు. కానీ విషయం తెలిసిన తర్వాత ఊపిరి పీల్చుకున్నారు. సీరీస్ లో చివరి విమానాన్ని తీసేసే ముందు చివరి సారిగా ఇలాంటి సెల్యూట్ చేస్తుండటం ఆనవాయితీ. మొత్తం మీద ఎయిర్ ఇండియాకు సుదీర్ఘ సేవలందించిన బోయింగ్ 747 సీరీస్ అలా పౌర విమాన యాన రంగం నుంచి నిష్క్రమించింది.