భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీ కువైట్లో పర్యటిస్తున్నారు. గత 43 ఏళ్లలో ఆ దేశంలో భారత ప్రధాని పర్యటించడం ఇదే తొలిసారి. కువైట్ అమీర్ షేక్ మెషాల్ అల్ అహ్మద్ అల్ జబీర్ అల్ సబాహ్ ఆహ్వానం మేరకు ఆయన పర్యటిస్తున్నారు. ఇండియా, కువైట్ దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతమే లక్ష్యంగా ఈ పర్యటన కొనసాగుతుందని విదేశాంగశాఖ ప్రకటన చేసింది.
ఈ పర్యటనలో రక్షణ, వాణిజ్య ఒప్పందాలు కుదిరే అవకాశం ఉంది. అంతేకాదు అక్కడి భారతీయులతో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు మోడీ. హలా మోడీ పేరుతో ఓ ఇవెంట్ను ప్లాన్ చేశారు. తన పర్యటనకు సంబంధించి మోడీ ఎక్స్లో ఓ పోస్ట్ పెట్టారు. ఇరు దేశాల ప్రజల ప్రయోజనం కోసం చర్చలు జరుగుతాయన్నారు. కువైట్కు, భారత్ మధ్య చారిత్రక బంధం ఉందని.. కేవలం వాణిజ్య, రక్షణ సంబంధాలు మాత్రమే కాదు.. ఇరు దేశాలు ప్రపంచ శాంతి, రక్షణ, స్థిరత్వం కోసం కృషి చేస్తాయన్నారు. అంతేకాదు కువైట్లోని ప్రవాస భారతీయులను కలుసుకునేందుకు ఎదురు చూస్తున్నానని తెలిపారు మోడీ.
చివరిసారిగా 1981లో అప్పటి ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ కువైట్లో పర్యటించారు. ఆ తర్వాత మోడీ అక్కడ పర్యటిస్తున్నారు. కువైట్- భారత్ మధ్య ద్వైపాక్షిక ఒప్పందం 2023–24లో ఏకంగా 10.47 బిలియన్ డాలర్లకు చేరింది. ఈ నెల 22 అంటే ఆదివారం కువైట్ ఉన్నతాధికారులతో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అధికారికంగా చర్చలు జరపనున్నారు. కువైట్లో దాదాపు పది లక్షల మంది భారతీయులు నివాసం ఉంటున్నారు. 2014లో ప్రధానిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు మోడీ పర్యటించని ఏకైక గల్ఫ్ కార్పొరేషన్ కౌన్సిల్ సభ్య దేశం కువైట్ మాత్రమే. ఇప్పుడు అది కూడా తీరిపోయిందనే చెప్పాలి.