సినీ నటుడు మంచు మోహన్ బాబు కుటుంబంలో తగాదాలకు సంబంధించి కొన్నాళ్లుగా ఘర్షణలు, కేసులు, వివరణలు చోటు చేసుకుంటున్న పరిణామాలు అందరికీ తెలిసిందే. సరిగ్గా వారం రోజుల క్రితం గత మంగళవారం జల్పల్లిలోని మోహన్బాబు నివసిస్తున్న ఇంటి దగ్గర ఆయన కుమారుడు మనోజ్ వచ్చిన సందర్భంగా ఘర్షణ చోటు చేసుకోవడం, మోహన్బాబు విచక్షణ కోల్పోయి జర్నలిస్టుపై దాడి చేయడం, పోలీసులు కేసు పెట్టడం వంటి పరిణామాలు తెలుగు రాష్ట్రాల్లో కలకలం సృష్టించాయి. ఈ వ్యవహారంపై పోలీసులు మోహన్బాబుకు నోటీసులు జారీచేశారు. అయితే, అనారోగ్య కారణాల దృష్ట్యా ఈనెల 24 వరకు తనకు అవకాశం ఇవ్వాలని మోహన్బాబు రిప్లై ఇచ్చారు.
తాజాగా మోహన్బాబు భార్య నిర్మల పోలీసులకు లేఖ రాశారు. డిసెంబర్ 14వ తేదీన తన పుట్టినరోజు నాడు తమ పెద్ద కుమారుడు మంచు విష్ణు జల్పల్లిలోని ఇంటికి వచ్చారని, ఆ సమయంలో కేక్ తీసుకొచ్చి తనతో కట్ చేయించి సెలబ్రేట్ చేశాడని లేఖలో నిర్మల వివరించారు. అయితే, తమ చిన్న కుమారుడు మనోజ్.. తమ ఇంటికి వచ్చిన విష్ణు సీసీ ఫుటేజ్ బయటపెట్టి.. విష్ణు గొడవ చేసినట్టు, లేని పోని అభాండాలు వేశాడని, పోలీసులకు కూడా ఈ అంశంపై ఫిర్యాదు చేసినట్లు తెలిసిందని ఆ లెటర్లో పేర్కొన్నారు. అయితే, తన పుట్టినరోజు కావడంతోనే విష్ణు ఇంటికి వచ్చాడని, తన రూములోని సామాను మాత్రమే తీసుకున్నాడని, కొద్దిసేపు మాత్రమే తమ ఇంట్లో ఉండి.. కేక్ కట్ చేయించి సెలబ్రేట్ చేశాడని వెల్లడించారు. తమ ఇంట్లో చిన్న కుమారుడు మనోజ్కు ఎంత హక్కు ఉందో, పెద్ద కొడుకు విష్ణుకు కూడా అంతే హక్కు ఉందని.. అయితే, పెద్ద కొడుకు విష్ణు ఎలాంటి దౌర్జన్యం చేయలేదని, బయటి మనుషులను ఇంట్లోకి తీసుకురాలేదని, గొడవ కూడా చేయలేదని నిర్మల ఆ లేఖలో పోలీసులకు వివరణ ఇచ్చారు. మనోజ్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో ఎలాంటి నిజం లేదని, తమ ఇంట్లో పనిచేసే పనిమనుషులు కూడా తమకు తామే మానేశారు తప్ప.. విష్ణు ప్రమేయం లేదని లేఖలో పోలీసులకు తెలియజేశారు.