2030 నాటికి 20 గిగా వాట్ల గ్రీన్ పవర్ ఉత్పత్తి లక్ష్యంగా ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తుంది, పునరుత్పత్తి(గ్రీన్ పవర్) విద్యుత్ రంగం దిశగా రాష్ట్రం దృఢ సంకల్పంతో పనిచేస్తుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. డిసెంబర్ 14 నుండి 20, 2024 వరకు నిర్వహించనున్న జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాల్లో భాగంగా , తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ పొదుపు వేడుకలు ఘనంగా జరుగనున్నాయి. ఈ సందర్భంగా ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు తెలంగాణ రాష్ట్ర పునరుత్పత్తి విద్యుత్ అభివృద్ధి సంస్థ (TGREDCO) అధికారులు రూపొందించిన 2025 సంవత్సరానికి సంబంధించిన విద్యుత్ పొదుపు క్యాలెండర్ను శుక్రవారం ప్రగతి భవన్ లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 2030 నాటికి 20GW పునరుత్పత్తి విద్యుత్ మరియు 2035 నాటికి 40GW స్థాపన లక్ష్యంగా ప్రభుత్వం ప్రత్యేక కార్యచరణ ప్రణాళిక రూపొందిస్తుందని వెల్లడించారు. విద్యుత్ పొదుపు, విద్యుత్ సమర్థత సాధన కు అన్ని రంగాల్లో టెక్నాలజీ ఆధారిత చర్యలు తీసుకుంటున్నామని ఆయన పేర్కొన్నారు.
గత ఏడాదికాలంగా TGREDCO చేపట్టిన కార్యక్రమాలను వి.సి.ఎం.డి. వావిల్ల అనిల డిప్యూటీ సీఎంకు వివరించారు. TGREDCO, విద్యుత్ పొదుపు, విద్యుత్ సమర్థతకు , బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ (BEE) తో కలిసి వివిధ కీలక కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేస్తోందని తెలిపారు. రాష్ట్రం ECBC అమలులో దేశంలోనే మొదటి స్థానంలో ఉందని, ఈ కోడ్ ప్రకారం 879 కమర్షియల్ భవనాలు ECBC అనుగుణంగా మార్పు చెందడంతో 392.21 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఆదా జరిగిందని వివరించారు. తెలంగాణ కూల్ రూఫ్ పాలసీ దేశంలోనే మొట్టమొదటి పాలసీ అని, ఇది వేసవి కాలంలో తాపాన్ని తగ్గించి శక్తి వినియోగాన్ని తగ్గిస్తుందని తెలిపారు. రాష్ట్రంలో 43 పరిశ్రమలు PAT డిజిగ్నేటెడ్ కన్జూమర్స్గా గుర్తించబడ్డాయని, మొదటి రెండు PAT సైకిల్స్ లో 0.24 మిలియన్ టన్నుల ఆయిల్ సమానమైన విద్యుత్ ఆదా జరిగిందని వివరించారు. హైదరాబాద్ నగరం మొత్తం 40MW విద్యుత్ ఆదా చేసిందని గర్వంగా చెప్పుకోవచ్చుని డిప్యూటీ సీఎంకు వివరించారు. రాష్ట్రంలోని 73 పట్టణాలు, గ్రామ పంచాయతీలలో 17.23 లక్షల వీధి దీపాలు LED లకు మార్చడం జరిగిందని తెలిపారు. 32 లక్షల LED బల్బులు, 20W LED ట్యూబ్ లైట్స్, 28W BLDC ఫ్యాన్లు సరసమైన ధరలో పంపిణీ చేయడంతో 439 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఆదా జరిగిందని పేర్కొన్నారు. అలాగే, విద్యార్థులలో విద్యుత్ సంరక్షణ మీద చైతన్యం కల్పించేందుకు 168 ఎనర్జీ క్లబ్బులు ఏర్పాటు చేశామని, ప్రభుత్వ సంస్థల్లో 57,483 పాత విద్యుత్ పరికరాలు ఆధునిక LED లకు మార్పు చెందడంతో 2.87 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఆదా జరిగిందని వివరించారు. ప్రతి సంవత్సరం తెలంగాణ స్టేట్ ఎనర్జీ కన్జర్వేషన్ అవార్డ్స్ ఇచ్చి సంరక్షణా కార్యక్రమాల్లో విశిష్టమైన పనితీరు అందించినవారిని గౌరవించడం జరుగుతుందని తెలిపారు. మూడుసార్లు జాతీయ విద్యుత్ పొదుపు అవార్డులు తెలంగాణ రాష్ట్రం అందుకుందని, విద్యుత్ పొదుపు వారోత్సవాల సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా మీడియా ద్వారా విస్తృత ప్రచారం, విద్యుత్ ర్యాలీలు, డిబేట్లు నిర్వహించనున్నట్లు డిప్యూటీ సీఎంకు వివరించారు. కార్యక్రమంలో టీజీ రెడ్కో జిఎం gsvప్రసాద్, డిప్యూటీ జనరల్ మేనేజర్ వెంకటరమణ, ప్రాజెక్ట్ డైరెక్టర్ రాధిక తదితరులు పాల్గొన్నారు.
2030 నాటికి 20 గిగావాట్ల గ్రీన్ పవర్ ఉత్పత్తి లక్ష్యం – డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
- Advertisement with us -