హైదరాబాద్ రామంతాపూర్లో కొద్దిరోజులుగా వింత పరిస్థితి స్థానికులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఇంటిబయట విడిచేస్తున్న బూట్లు మాయమవుతున్నాయి. మొదట్లో ఒకరిద్దరు తేలిగ్గా తీసుకున్నప్పటికీ.. రోజు రోజుకూ ఈ సంఘటనలు ఎక్కువవుతుండటంతో స్థానికులంతా ఆందోళన చెందారు. బూట్లు మాయమవుతుండటం దేనికి సంకేతమంటూ కొందరు కీడు శంకించారు కూడా. అయితే, ఇదేదో దొంగల పనే అయి ఉంటుందని మరికొందరు నిర్ధారణకు వచ్చారు. ఎందుకంటే ఒకటి కాదు.. రెండు కాదు.. కేవలం రెండు నెలల్లో అదే ప్రాంతంలో వెయ్యికి పైగా బూట్లు చోరీ అయ్యాయి. ఇంటి ముందు, గేటు బయట విడుస్తున్న బూట్లనే దొంగలు టార్గెట్ చేస్తున్నారు. దీంతో, కాలనీవాసులంతా కలిసి నిఘా పెట్టారు. రాత్రివేళల్లో ఆ ప్రాంతంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న వాళ్లపై కన్నేశారు. బూట్లు ఎత్తుకెళుతున్న సమయంలో ఓ వ్యక్తి దృశ్యాలు అక్కడ సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. వాటి ఆధారంగా ఆ వ్యక్తిని గుర్తించిన కాలనీవాసులు.. అతన్ని రామంతాపూర్ వాసవీ నగర్లో నివసించే మల్లేష్గా గుర్తించారు. అతని ఇంటికి వెళ్లారు. ఆ సమయంలో ఇంటినిండా దొంగతనం చేసిన బూట్లు కనిపించాయి. విషయం తెలుసుకున్న చెప్పులు, బూట్ల బాధితులందరూ మల్లేష్ ఇంటికి చేరుకోవడంతో కాసేపు గందరగోళం నెలకొంది. స్థానికులంతా కలిసి ఉప్పల్ పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి వచ్చిన పోలీసులు మల్లేష్, రేణుక దంపతులను పోలీస్స్టేషన్కు తీసుకెళ్లారు.
బూట్లు దొంగతనం చేస్తున్న మల్లేష్, తన భార్య రేణుకతో కలిసి కొంతకాలంగా వాసవినగర్లో అద్దెకు ఉటున్నారు. కొంతకాలంగా రాత్రివేళల్లో కాలనీ పరిసరాల్లో తిరుగుతూ బూట్లు దొంగిలిస్తున్నారు. వాటిని ఎర్రగడ్డ మార్కెట్కు తీసుకెళ్లి.. రూ.100, రూ.200కు అమ్ముతున్నారు. పోలీసుల విచారణలో నిందితుడు ఈ నిజం ఒప్పుకున్నాడు. తాను, తన భార్య రేణుక ఇద్దరం కలిసి బూట్లు ఎత్తుకెళ్తున్నట్లు చెప్పాడు. ఈ సంఘటన స్థానికంగా ఆసక్తికర చర్చను లేవనెత్తింది.