-
ఆసక్తి కరంగా మారిన కేంద్ర ప్రభుత్వం నిర్ణయం
-
విదేశీ బృందం కోసం పేర్లు ఇవ్వాలని కాంగ్రెస్కు ప్రభుత్వం సూచన
-
శశిథరూర్ కాకుండా నలుగురి పేర్లు ఇచ్చిన కాంగ్రెస్
-
విదేశీ టూర్కు శశిథరూర్ నాయకత్వం వహిస్తారంటూ కేంద్రం ప్రకటన
పాకిస్తాన్ కుయుక్తులను ప్రపంచ దేశాలకు తెలియజేసే విధంగా భారత్ నుంచి ఓ అఖిల పక్ష బృందాన్ని అంతర్జాతీయ పర్యటనకు పంపించాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. ప్రధానంగా ఆపరేషన్ సిందూర్కు దారితీసిన పరిస్థితులు, పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదం గురించి అందరికీ తెలియజేయడమే ఈ పర్యటన ప్రధాన ఉద్దేశ్యం. అయితే, ఈ బృందంలో చేర్చేందుకు ఆయా పార్టీల నుంచి పేర్లు ఇవ్వాలని కేంద్రం ప్రధాన రాజకీయ పార్టీలను కోరింది. ఈమేరకు ఈనెల 16వ తేదీన కాంగ్రెస్ పార్టీకి కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు లేఖ రాశారు. ఈ లేఖ ఆధారంగా కాంగ్రెస్ పార్టీ నలుగురు ఎంపీలతో కూడిన జాబితాను కేంద్రానికి సూచించింది. ఆనంద్ శర్మ, గౌరవ్ గొగోయ్, డాక్టర్ సయ్యద్ నసీర్ హుస్సేన్, రాజా బ్రార్ల పేర్లను కాంగ్రెస్ తరఫున ఎంపిక చేసినట్లు లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సమాధానమిచ్చారు.
అయితే, కాంగ్రెస్ పార్టీ సూచించిన జాబితాలో ఆ పార్టీ ఎంపీ, మాజీ కేంద్రమంత్రి శశిథరూర్ పేరు లేదు. కానీ, కేంద్ర ప్రభుత్వం ఆశ్చర్యకరమైన నిర్ణయం తీసుకుంది. ఈ బృందంలో శశిథరరూర్ను ఎంపిక చేయడంతో పాటు.. ఏకంగా ఈ ప్రతినిధి బృందానికి ఆయనే నాయకత్వం వహిస్తారని ఉత్తర్వులు జారీచేసింది. తిరువనంతపురం నుంచి నాలుగుసార్లు ఎంపీగా గెలిచిన శశి థరూర్ ఈ అఖిలపక్ష బృందానికి నేతృత్వం వహిస్తారని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది.