ఒడిశాలోని పరదీప్ ఓడరేవులో బుధవారం ఉదయం చోటు చేసుకున్న పరిణామం భద్రతా వర్గాలను ఉరుకులు పరుగులు పెట్టించింది. దక్షిణ కొరియా నుంచి సింగపూర్ మీదుగా వచ్చిన ‘ఎమ్టీ సైరెన్ II’ అనే వాణిజ్య నౌక పరదీప్ పోర్టుకు చేరుకుంది. అందులో 25 మంది సిబ్బంది ఉన్నారు. ఈ సిబ్బందిలో 21 మంది పాకిస్థానీయులుగా గుర్తించడంతో భద్రతా వ్యవస్థలు అప్రమత్తమయ్యాయి. భారత్–పాకిస్థాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ అంశం ప్రాధాన్యత సంతరించుకుంది.
ఈ నౌక ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ కోసం సుమారు 11,350 మెట్రిక్ టన్నుల ముడి చమురును తీసుకువచ్చింది. ప్రస్తుతం నౌక పోర్టుకు సుమారు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న ‘పీఎమ్ బెర్త్’ వద్ద లంగరు వేసి ఉంది. ఇమిగ్రేషన్ అధికారులు అప్రమత్తం చేయడంతో ఒడిశా మెరైన్ పోలీసులు, సీఐఎస్ఎఫ్ సిబ్బంది హైఅలర్ట్ ప్రకటించి భద్రతను కట్టుదిట్టంగా అమలు చేస్తున్నారు.
పోర్ట్ పరిసరాల్లో గట్టి భద్రతా చర్యలు తీసుకోవడంతో పాటు, చమురు అన్లోడ్ ప్రక్రియ పూర్తయ్యేంత వరకు నౌకలోని సిబ్బంది ఎవరూ నౌకను వదిలి కిందికి దిగేందుకు అనుమతి లేదని స్పష్టంచేశారు. పరిస్థితిని సమీక్షిస్తూ, అవసరమైతే అదనపు చర్యలు తీసుకునేందుకు సన్నద్ధంగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.