భారత్ వైమానిక దళం దాడుల తర్వాత, ఇప్పుడు నావికాదళం కూడా సమరభూమిలో అడుగుపెట్టింది. అరేబియా సముద్రంలో మోహరించిన భారత వైమానిక నౌక ఐఎన్ఎస్ విక్రాంత్ పాకిస్తాన్కి మరణహోమంలా మారింది. కరాచీ నౌకాశ్రయాన్ని లక్ష్యంగా చేసుకుని ప్రారంభించిన నావికాదళ దాడుల్లో భారీ విధ్వంసం చోటుచేసుకుంది. క్షిపణుల వర్షంతో కరాచీతో పాటు ఒర్మారా ఓడరేవులపై మంటలు అంటుకున్నాయి. మంటలతో నగరంపై పొగలు అలుముకున్నాయి. సముద్ర తీర ప్రాంతాల ప్రజలు భయాందోళనలతో బంకర్లలోకి పరుగులు తీశారు.
రక్షణ వర్గాల సమాచారం మేరకు ఐఎన్ఎస్ విక్రాంత్ నుండి ప్రయోగించిన అనేక క్షిపణులు కరాచీ, ఒర్మారా నౌకాశ్రయాలపై నిప్పులు కురిపించాయి. ఇవి పాకిస్తాన్ నావికాదళానికి కీలకమైన స్థావరాలు. అక్కడే ఉన్నతాధికారుల కార్యాలయాలు, యుద్ధ నౌకలు, జలాంతర్గాములు మోహరించబడ్డాయి. ఈ స్థావరాలపై జరిగిన దాడులతో పాక్ నౌకాదళానికి తీవ్రమైన నష్టం వాటిల్లింది. ఐఎన్ఎస్ విక్రాంత్ దాడి పాక్ నావికాదళ సామర్థ్యాన్ని తీవ్ర స్థాయిలో దెబ్బతీసింది. ప్రస్తుతం భారత నావికాదళం నిర్వహిస్తున్న ఆపరేషన్ ఇంకా కొనసాగుతూనే ఉంది.
ఐఎన్ఎస్ విక్రాంత్ మోహరించిందన్న వార్తలు వచ్చినప్పటి నుంచే పాకిస్తాన్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇది నీటిలో తేలియాడే భారతదేశపు అత్యాధునిక విమాన వాహక నౌక. దీని ఓవర్ హెడ్లో 30 మిగ్-29కే యుద్ధ విమానాలు సిద్ధంగా ఉంటాయి. దీనితో పాటు డిస్ట్రాయర్లు, ఫ్రిగేట్లు, ఇంధన నౌకలు, జలాంతర్గాములు కలిసిన ఈ సముద్ర బలగాన్ని ఎదుర్కోవడం పాక్ తరం కాదు.
ఇంత బలమైన నౌకకు పాక్ వద్ద పోటీ ఇవ్వగలిగే విమాన వాహక నౌక లేదు. ఐఎన్ఎస్ విక్రాంత్ లో MiG-29K, Kamov-32, MH-60R, అడ్వాన్స్డ్ లైట్ హెలికాప్టర్లతో సహా సుమారు 30 రకాల విమానాలు, హెలికాప్టర్లు మోహరించగలవు. ఇది తేలికపాటి యుద్ధవిమానాలను కూడా మోసుకెళ్లగలుగుతుంది. ఈ నౌక రంగంలోకి దిగడమే పాకిస్తాన్కి కాళరాత్రిగా మారింది.