- కేంద్రానికి తీర్మానం కాపీ పంపాలని మంత్రిమండలి నిర్ణయం
- వైసీపీ హయాంలో చేసిన మూడు చట్ట సవరణ బిల్లులు వెనక్కి
ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని నిర్ణయిస్తూ ఏపీ క్యాబినేట్ సమావేశంలో తీర్మానం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి అధ్యక్షతన బుధవారం వెలగపూడిలోని సచివాలయంలో ఆంధ్రప్రదేశ్ మంత్రి మంలి సమావేశం అయ్యింది. ఈ సమావేశలో అమరావతిని రాజధానిగా తీర్మానం చేస్తూ ఆ తీర్మానాన్ని కేంద్రానికి పంపాలని నిర్ణయించింది. అలాగే పహల్గాం ఉగ్రదాడులకు ప్రతిగా భారత వైమానిక దళం నిర్వహించిన ఆపరేషన్ సింధూర్ విజయవంతం అయినందుకు మంత్రిమండలి అభినందించింది. అదేవిధంగా అమరావతి పనుల పునఃప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని నరేంద్రమోడీకి మంత్రి మండలి ధన్యవాదాలు తెలిపింది. భారత సైన్యానికి అండగా ఉండాలని క్యాబినేట్ నిర్ణయించంది. ఇక ఏపీ రాజధానిగా అమరావతి అని పొందుపరుస్తూ 2014 ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో సవరణ చేయాలని మంత్రిమండలి కేంద్రాన్ని కోరింది. చట్టంలో అమరావతినే రాజధానిగా పెట్టాలని కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. ఇలా చట్టం సవరించడం వల్ల అమరావతికి రాజధానిగా చట్ట బద్దత కల్పించినట్లు అవుతుందని మంత్రి మండలి అభిప్రాయపడింది. పునర్విభజన చట్టంలో రాజధాని అమరావతి అని లేదని ఒక సారి చట్ట సవరణ జరిగితే అమరావతికి చట్టబద్దత వస్తుందని న్యాయనిపుణులు సూచించండంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ మధ్య జరిగిన సీఆర్డీఏ 47వ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను క్యాబినేట్ ఆమోదించింది. రాజధాని పరిధిలో వివిధ సంస్ధలకు భూకేటాయింపులను ఆమోదం తెలిపింది. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ఆమోదించి కేంద్రానికి పంపిన మూడు చట్టసవరణ బిల్లులను వెనక్కి తీసుకోవాలని ఏపీ క్యాబినేట్ నిర్ణయం తీసుకుంది. రాజధాని అమరావతి ప్రాంతాన్ని ఫ్రీజోన్ గా చేసుకోవాలని సమావేశంలో మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రతిపాదించారు.