ములుగు జిల్లాలోని ప్రధాన జలవనరుల పథకాలైన జే.చొక్కారావు దేవాదుల ఎత్తిపోతల ప్రాజెక్టు, సమ్మక్క సాగర్ బ్యారేజి తీవ్ర నీటి కొరతతో ఎడారుల్లాగా మారిపోయాయి. ఎగువ ప్రాంతాల నుంచి నీటి ప్రవాహం తగ్గిపోవడంతో, ఈ ప్రాజెక్టులు ప్రస్తుతం ఇసుక మైదానాలుగా కనిపిస్తున్నాయి.
సమ్మక్క సాగర్ బ్యారేజి పూర్తి సామర్థ్యం 6.94 టీఎంసీలు అయినా, ప్రస్తుతం కేవలం 0.76 టీఎంసీలు మాత్రమే నీటి నిల్వ ఉంది. సాధారణంగా 83 మీటర్ల నీటి మట్టం ఉండాల్సిన చోట ఇప్పుడు అది 72.30 మీటర్దకు పడిపోయింది. దీంతో పాటు, బ్యారేజీకి కేవలం 100 క్యూసెక్కుల నీరు మాత్రమే చేరుతోంది. ప్రస్తుతం 59 గేట్లలో 58 గేట్లు మూసివేయగా, ఒక్క గేటు ద్వారానే 300 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు.
ఇక దేవాదుల ఎత్తిపోతల పథకానికి నీరు అందకపోవడంతో, ఇంటెక్ వేల్ వద్ద కొన్ని మోటార్లు నిలిపివేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం గోదావరిలో నీటి మట్టం 71.75 మీటర్లు మాత్రమే ఉండటంతో, ఇది పంపింగ్కు అవసరమైన కనీస మట్టానికి సరిపడడం లేదు. దీనివల్ల గొల్లబుద్దారం, భీమ్ ఘనపూర్ లాంటి దిగువ జలాశయాలకు నీరు చేరకపోవడంతో, రైతులకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికైనా అవసరమైన చర్యలు తీసుకోకపోతే, దిగువ ప్రాంతాల్లో సాగునీటి కష్టాలు పెరిగే ప్రమాదం పొంచి ఉంది.