సన్ రైజర్స్ రైజ్ కాలేదు.. తప్పక గెలవాల్సిన మ్యాచ్లో టైటాన్స్ చేతిలో ఓడింది. దీంతో భారీ అంచనాలతో సీజన్ను ప్రారంభించిన కాటేరమ్మ కొడుకులు.. కనీసం ప్లే ఆఫ్స్కు కూడా చేరుకోలేకపోయారు. గుజరాత్పై 38 పరుగుల తేడాతో ఓడి ఐపీఎల్ ప్లే ఆఫ్స్ రేస్ నుంచి దాదాపుగా నిష్క్రమించి ఫ్యాన్స్కు తీవ్ర నిరాశనే మిగిల్చారు.
మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ సన్రైజర్స్ ముందు 224 పరుగుల టార్గెట్ను ఉంచింది. ఎప్పటిలాగానే సాయి సుదర్శన్ కిక్ స్టార్ట్ ఇచ్చాడు గుజరాత్కు. 23 బంతుల్లోనే 48 పరుగులు చేశాడు. ఇక మరో ఎండ్లో శుభ్మన్ గిల్ చెలరేగిపోయాడు. ఈసారి 76 పరుగులు చేశాడు. సాయి సుదర్శన్ ఔట్ అయిన తర్వాత వచ్చిన బట్లర్ కూడా ఎక్కడా తగ్గలేదు. 64 పరుగులు చేసి.. ఇక చివర్లో వాషింగ్టన్ సుందర్ కూడా 21 పరుగులు చేశాడు. ఇలా ఎవరికి వారు ఎక్కడా తగ్గకుండా స్కోర్ చేయడంతో.. 6 వికెట్లు కోల్పోయి 224 పరుగులు చేసింది గుజరాత్.
ఇక లక్ష్య చేధనలో సన్ రైజర్స్ మొదట ధాటిగానే ఆడినట్టు కనిపించింది. కానీ హెడ్ 20 పరుగులకే వెనుదిరగడంతో.. రైజర్స్ కష్టాలు మొదలయ్యాయి. అభిషేక్ శర్మ 74 పరుగులతో చెలరేగినా ఫలితం లేకుండా పోయింది. ఇషాన్, క్లాసెన్, అనికేత్, నితీష్, మెండిస్, కమిన్స్.. ఎవరూ కూడా ధాటిగా ఆడలేదు. గుజరాత్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో కావాల్సిన రన్రెట్ పెరిగిపోయి.. బ్యాటర్లపై ఒత్తిడి పెరిగింది. దీంతో కీలకమైన వికెట్లు కోల్పోయారు రైజర్స్. 20 ఓవర్లలో కేవలం 6 వికెట్లు కోల్పోయి 186 పరుగులు మాత్రమే చేయగలిగింది SRH. ఈ ఓటమితో సన్ రైజర్స్ ప్లే ఆఫ్ ఆశలు దాదాపు గల్లంతైనట్టే. ఇక ఏడో విక్టరీతో GT ప్లే ఆఫ్స్ రేసులో ముందంజ వేసింది.