- దిఘా లో ఉన్నది ఆలయమా?కల్చరల్ సెంటరా?
- బెంగాల్ ప్రభుత్వంపై రేగుతున్న విమర్శలు
- జగన్నాథ ఆలయం పవిత్రతను దెబ్బతీసే ఎత్తుగడ?
- అలాంటి నిర్మాణమే చేసి అదే పేరు పెట్టిన ప్రభుత్వం
- పైగా పూరీ దాకా ఎందుకు? అంటూ ప్రచారం
- మత విశ్వాసాలపై దారుణమైన దాడి అనే వాదనలు
- థామానికి ప్రత్యేకమైన విశిష్టత, ప్రాశస్త్యం, చారిత్రక గుర్తింపు
- దేశంలో ఉన్నవి నాల్గు థామాలే..
- థామం పేరును దుర్వినియోగం చేయద్దని విన్నపాలు
- మమత ప్రభుత్వంపై పెరుగుతున్న ఒత్తిడి
బెంగాల్ లో ఓ ఆలయానికి పూరి జగన్నాథ్ ధామ్ అని పేరు పెట్టడం ఇప్పుడు ఒడిసా, బెంగాల్ మధ్య వివాదాస్పదమవుతోంది.ఇప్పటి వరకూ దేశంలో పూరి జగన్నాథ్ ఆలయం అంటే అది ఒరిస్సాలోని పూరి లో ఉన్నదే.. అది 12వ శతాబ్దానికి చెందిన అత్యంత పురాతనమైన ఆలయం. హిందూ మతస్థులకు ఉన్న నాలుగు ప్రధాన థామ్ లలో పూరీ ఒకటి. ఇప్పుడు బెంగాల్లోని ఆలయానికి జగన్నాథ్ థామ్ అని పేరు పెట్టడంపై హిందూ మేధావులు, పూజారులు, వైదిక మతపెద్దలు కూడా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. హిందూ మతంలో థామ్ అన్న పదానికి అత్యంత పవిత్రమైన హోదా, విశ్వాసం ఉన్నాయి. ఆ హోదాను మరే ఆలయానికీ అన్వయించరు. పూరీ జగన్నాథుని ఆలయం కూడా మన పురాతన శాస్త్రాలు నిర్ణయించిన నాల్గు థామాల్లో ఒకటి. ఇది శతాబ్దాలుగా ఆ పవిత్ర థామానికి ఉన్న చారిత్రక ప్రాశస్త్యం.
బెంగాల్ లో 22 ఎకరాల విస్తీర్ణంలో 250 కోట్లతో నిర్మించిన థిగాలోని ఈ ఆలయం హిందువులకు దర్శనీయమైన, టూరిజం కేంద్రం. అయితే ఈ నిర్మాణానికి వెస్ట్ బెంగాల్ టూరిజం శాఖ చేస్తున్న ప్రచారమే ఇప్పుడు వివాదానికి కారణమైంది. ఇప్పుడిక జగన్నాథుని, సముద్రాన్ని చూసేందుకు పూరీకి వెళ్లనక్కరలేదంటూ సోషల్ మీడియాలో కల్పిస్తున్న ప్రచారం పై వివాదం రేగుతోంది.
థామ్ పేరుతో వివాదం
ధామ్ అంటే తెలుగులో థామం అని.. ఇంకా చెప్పాలంటే నిలయం అని. పవిత్రమైన హిందూ ఆలయాలకు థామ్ అనే పేర్లు చివర ఉండటం హిందూ మతంలో మాత్రమే కనిపించే ఆనవాయితీ.. చార్ ధామ్, అక్షర్ ధామ్ లాగా జగన్నాథ్ థామ్ కి మాత్రమే ఆ ప్రాశస్త్యం దక్కింది. శతాబ్దాల నాటి పవిత్ర నిర్మాణాలు నేటికీ చెక్కు చెదరకుండా ఉండటం,వాటికున్న చారిత్రక, మహిమాన్విత ప్రాశస్యం వల్ల వాటికా పేరు వచ్చింది. 8వ శతాబ్దంలో ఆధ్యాత్మిక గురువులు తత్వవేత్త ఆదిశంకరాచార్యులు పూరీని మన దేశంలో ఉన్న నాలుగు ప్రధాన థామాల్లో ఒకటిగా పేర్కొన్నారు. ఇవే కాక బద్రీనాథ్, ద్వారక, రామేశ్వరం ఆలయాలను మిగిలిన మూడు ధామాలుగా చరిత్ర గుర్తించింది. ఈ ఆలయాల చివర ఉన్న థామం అన్న పేరును మరి వేటికీ అన్వయించే అర్హత లేదన్నది హిందూ మతం చెబుతోంది.
మత విశ్వాసాలను దెబ్బతీయడమే..
అలాంటిది..ఇప్పుడు పూరీ జగన్నాథుని ఆలయానికి పోటీగా బెంగాల్ థిగాలోని ఆలయాన్ని జగన్నాథ్ ధామ్ అనడం ఏంటన్న దుమారం రేగుతోంది. దీనిని ఖండిస్తూ పద్మశ్రీ పురస్కార గ్రహీత, అంతర్జాతీయ సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ ఒడిసా ముఖ్యమంత్రికి లేఖ రాశారు. దిఘాలోని జగన్నాథ ఆలయానికి జగన్నాథ ధామ్ అని పేరు పెట్టడం హిందూ మతస్థుల విశ్వాసాన్ని దెబ్బతీయడమేనని, అది చరిత్రాత్మక పూరీ జగన్నాథుని ఆలయ పవిత్రతకి భంగం కల్పించడమేనని అన్నారు.ప్రపంచ వ్యాప్తంగా ఉన్న లక్షల మంది జగన్నాథ భక్తుల మత విశ్వాసాలను ఇది దెబ్బతీస్తోందని ఆయనన్నారు. హిందూ మత గ్రంథాలు, శాసనాలను బట్టి పూరీలో ఉన్న ఆలయం జగన్నాథ ఆలయం ఒక్కటే .. అదే జగన్నాథ థామ్.. మరే ఆలయానికైనా థామ్ అని పెడితే అది గందరగోళానికి దారి తీయడమే కాక దీర్ఘకాలంగా ఉన్న హైందవ ఆధ్యాత్మిక, విశ్వాసాలను దెబ్బతీస్తుంది.
ఒడిసా ప్రభుత్వం తక్షణం దీనిపై బెంగాల్ ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి పొరపాటును సరిదిద్దాలని సుదర్శన్ పట్నాయక్ కోరారు. మమతా బెనర్జీ ప్రభుత్వం ఈ ఆలయ ప్రచారం కోసం తయారు చేసిన కరపత్రాల్లో కూడా ఒడిసా జగన్నాథ ఆలయంపై ఉన్న నీల చక్రంను పోలిన నీలచక్రమే ముద్రించారు. ఇది రెండు ఆలయాలు ఒకటేనన్న భ్రమ కలిగించేలా ఉందన్న ఆరోపణలు రేగుతున్నాయి.
ఆలయమా? సాంస్కృతిక కేంద్రంమా?
ఇదే అంశంపై బెంగాల్ ప్రతిపక్ష నేత,బీజేపికి చెందిన సువేందు అధికారి మమత ప్రభుత్వానికి బహిరంగ లేఖ రాశారు. ఇది ఆలయమా లేక సాంస్కృతిక కేంద్రమా? వెల్లడించాలని కోరారు. ఇది సాంస్కృతిక కేంద్రమే అయితే ఆలయ ప్రారంభోత్సవమంటూ ప్రజలను ఎందుకు ఆహ్వానిస్తున్నారు. ఆహ్వాన పత్రాల్లో ఇది ఆలయమా, సాంస్కృతిక కేంద్రమా ముందు స్పష్టం చేయండని నిలదీశారు.ఒక మత ప్రార్థనా మందిర నిర్మాణానికి పబ్లిక్ ఫండ్ ఎలా వినియోగిస్తారు. అయోధ్యలోని రామ మందిరాన్ని సైతం ఒక స్వచ్ఛంద ట్రస్ట్ ను నెలకొల్పి విరాళాలు సేకరించి నిర్మించారు. మరి దీనికి ప్రభుత్వ ధనాన్ని ఎలా వాడతారని సువేందు అధికారి ప్రశ్నించారు.
హిందూ ఓటర్లకు గాలం?
కొల్ కాతాకు కొన్ని గంటల ప్రయాణ దూరంలో ఉన్న దిఘా లాంటి ప్రదేశంలో ఒక ఆలయాన్ని నిర్మించి దాని ప్రారంభోత్సవం అట్టహాసంగా జరపడం వెనక రాజకీయ కారణాలే ఎక్కువ కనిపిస్తున్నాయని సువేందు అధికారి అన్నారు. బెంగాల్ కు త్వరలో అసెంబ్లీ ఎన్నికలు రానున్న నేపధ్యంలో హిందూ ఓటర్లకు గాలమేయడానికే మమత ఈ ఆలయాన్ని నిర్మించారని ఎన్నికలప్పుడు ఇలా ప్రజాకర్షక ఎత్తుగడలు మమతకు మామూలేననే విమర్శలు కూడా వినిపస్తున్నాయి.