- పహల్గామ్ ఉగ్రదాడి తరువాత మోడీలో ఆవేదన చూశా
- రాజధాని నిర్మాణంలో మోడీ కొన్ని సూచనలు చేశారు
- కులగణన నిర్ణయం గేమ్ ఛేంజర్
- ప్రధాని మోడీని చూసి మేమంతా గర్వపడుతున్నాం
- అమరావతి పునఃప్రారంభ సభలో చంద్రబాబు
మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చాలా శక్తివంతమైన నాయకుడని, ప్రపంచం అంతా ఆయన నాకత్వాన్ని కొనయాడుతోందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. శుక్రవారం ఆంద్రప్రదేశ్ రాజధాని అమరావతితో పాటు రాష్ట్రంలో పలు అభివృద్ధి పనులకు మోడీ వర్చువల్గా శంకుస్ధాపనలు చేశారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో సీయం చంద్రబాబు మాట్లాడుతూ ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో శాశ్వతంగా నిలిచిపోతుందన్నారు. గతంలో మన ప్రధాని నరేంద్ర మోడీనే అమరావతికి శంకుస్ధాపన చేశారని అయితే గడచిన ఐదేళ్ళ కాలంలో ఎక్కడికక్కడ నిలిచిపోయిన పనులను మళ్ళీ ప్రధాని నరేంద్ర మోడీనే పునః ప్రారంభిస్తున్నారంటే ఇంతకంటే మంచి రోజు ఏముంటదన్నారు. గతంలో తాను మోడీని ఎప్పుడు కలసినా చాలా అహ్లాదకరంగా ఉండేవారని, కానీ పలహల్గామ్ ఉగ్రదాడి తరువాత నేను అమరావతి పునఃప్రారంభ కార్యక్రమానికి ఆహ్వానించడానికి వెళితే చాలా గంభీరంగా కనిపించారని, ఉగ్రవాదుల దాడిలో నా దేశ ప్రజలు చనిపోయారనే ఆవేదన నేను ఆయనలో చూశానని చంద్రబాబు చెప్పారు. ఉగ్రవాదం అణచివేయడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకునే ఎటువంటి చర్యలకైనా ఆంధ్రప్రదేశ్ అండగా ఉంటుందని సీయం చెప్పారు. ఎప్పుడైనా ఒక కుటుంబానికో, ఒక వ్యాపార సంస్ధకో, ఒక ఫ్యాక్టరీకో బలమైన నాయకత్వం ఉంటే అది బాగుపడుతుందని, అలాగే దేశానికి మోడీ వంటి బలమైన నాయకుడు ఉన్నారని మన దేశం కూడా నెంబర్ ఒన్ అవుతుందని చంద్రబాబు ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రధాని మోడీని చూసి మేమంతా గర్వపడుతున్నామని అన్నారు. మీరు కులగణన చేయాలని తీసుకున్న నిర్ణయం దేశానికే గేమ్ ఛేంజర్ అవుతుందని మోడీని కొనియాడారు. 2024 ఎన్నికల్లో మోడీతో పాటు మా మీద నమ్మకంతో మీరంతా కూడా కూటమిని గెలిపించారు. అధికారంలోకి వచ్చాక చూస్తే ఆర్థిక వ్యవస్ధ అగమ్య గోచరంగా ఉంది. ఏం చేయాలో తెలియని పరిస్ధితి ఆసమయంలో కేంద్రం రాష్ట్రానికి ఆక్సిజన్ ఇచ్చింది. వెంటిలేటర్ మీద ఉన్న రాష్ట్ర ఆర్థిక స్ధితి బయటపడింది. ఇంకా కొన్ని రోజులు సహకరిస్తే ఆంధ్రప్రదేశ్ ని ఒక బలమైన ఆర్థిక శక్తిగా చేస్తామని చంద్రబాబు అన్నారు. అమరావతి ఒక నగరం కాదని, ఐదు కోట్ల మంది సెంటిమెంట్ అని, వారందరి ఆశయాలకు ప్రతిరూపమన్నారు. ఐదు సంవత్సరాలు విధ్వంసం జరిగింది. రాజధాని కోసం రైతులు, మహిళలు, వీరోచితంగా చేసిన పోరాటాల ఫలితంగానే ఈ రోజు అమరావతి పనలు పునఃప్రారంభమవుతున్నాయి అన్నారు. మీరిచ్చిన ఏకపక్ష తీర్పే అమరావతికి మళ్ళీ ఊపిరి పోసిందన్నారు. మోడీ ఆశీస్సులతో పది నెలల్లోనే అమరావతిని పట్టాలెక్కించామని, ఐదు కోట్ల మంది ప్రజలు అమరావతి నా రాజధాని అని గర్వంగా చెప్పుకునే విధంగా నిర్మాణం చేస్తామని చంద్రబాబు సభావేదిక నుంచి రాష్ట్ర ప్రజలకు హామీ ఇచ్చారు. మూడేళ్ళలో అమరావతి పూర్తి చేసి మళ్ళీ ప్రధాని మోడీని ప్రారంభోత్సవానికి పిలుస్తామన్న నమ్మకం నాకు ఉందన్నారు. రాజధాని నిర్మాణంలో ప్రధాని మోడీ కొన్ని సూచనలు చేశారని అవన్నీ పాటిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు.