-
పాకిస్తాన్ నుంచే వచ్చిన ఉగ్రవాదులు
-
సహకరించిన 15 మంది ఓవర్ గ్రౌండ్ వర్కర్లు
జమ్మూ కశ్మీర్లోని పహల్గామ్లో ఇటీవల జరిగిన ఉగ్రదాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయిన ఘటనపై నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఇప్పటికే దర్యాప్తు ప్రారంభించింది. ప్రాథమిక నివేదికల ప్రకారం, ఈ దాడికి పాల్పడిన ఉగ్రవాదులు రెండు సంవత్సరాల క్రితమే పాకిస్తాన్ నుంచి భారత్కు అక్రమంగా ప్రవేశించారు. ముసా, అలీ అనే ఉగ్రవాదులు 2023లో ఇండియాలోకి చొరబడి, కశ్మీర్లోని థోకర్ ప్రాంతంలో స్థానిక గైడ్లుగా పనిచేస్తూ కార్యకలాపాలు సాగించారు.
అనంత్నాగ్ జిల్లాలోని గుర్రే గ్రామానికి చెందిన థోకర్ 2018లో పాకిస్తాన్కు వెళ్లి గత సంవత్సరం తిరిగి లోయకు చేరుకున్నట్లు పోలీసు రికార్డులు వెల్లడిస్తున్నాయి. ఇతను శిక్షణ పొందిన పాకిస్తానీ ఉగ్రవాదులకు మార్గదర్శిగా వ్యవహరించినట్లు అధికారులు భావిస్తున్నారు. ముసా మొదట సాంబా, కథువా సెక్టార్ల ద్వారా దేశంలోకి చొరబడగా, బుద్గాం జిల్లాలో ప్రధానంగా సంచరించేవాడని తెలుస్తోంది. అలీ తర్వాత ఇండియాలోకి ప్రవేశించి శ్రీనగర్ శివార్లలోని దచిగాం అడవుల్లో కార్యకలాపాలు నిర్వహించినట్లు సమాచారం. వీరిద్దరికి సుమారు 15 మంది స్థానిక కశ్మీరీ ఓవర్గ్రౌండ్ వర్కర్లు (OGW) సహాయం చేసినట్లు భద్రతా సంస్థలు అనుమానిస్తున్నాయి. ఈ OGWల ద్వారానే పాకిస్తాన్ నుండి ఆయుధాలు ఉగ్రవాదులకు చేరాయని భావిస్తున్నారు.
దాడి అనంతరం ఉగ్రవాదులను పట్టుకునేందుకు భద్రతా బలగాలు విస్తృతమైన ఆపరేషన్లను ప్రారంభించాయి. మొదట పహల్గామ్ తహసీల్లోని హపత్ నార్ గ్రామ సమీప అడవుల్లో ఉగ్రవాదులు ఉన్నట్లు గుర్తించిన భద్రతా దళాలు, అక్కడికి చేరుకునేలోగా వారు తప్పించుకున్నట్లు సమాచారం. అనంతరం వారు కుల్గాం అడవుల్లో కనిపించగా, అక్కడ వారిపై భద్రతా దళాలు కాల్పులు జరిపినప్పటికీ, వారు అక్కడి నుంచి కూడా తప్పించుకున్నట్టు నివేదికలు చెబుతున్నాయి. ప్రస్తుతం ఉగ్రవాదులు ట్రాల్ శిఖరం, కోకెర్నాగ్ ప్రాంతాల్లో దాక్కున్నారని భద్రతా వర్గాలు అనుమానిస్తున్నాయి.