భారత్ పాక్ సరిహద్దులో ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. దాయాది పాక్ తన వంకర బుద్దిని చూపిస్తూనే ఉంది. వరుసగా నాలుగోరోజు LOC వద్ద ఉన్న భారత ఆర్మీ పోస్టులపై కాల్పులు జరుపుతూనే ఉంది. ఓ వైపు ఉగ్రవాదుల కోసం అడవులను భద్రతా బలగాలు జల్లెడ పడుతున్న సమయంలోనే ఇలాంటి అటెన్షన్ డైవర్షన్ పనులకు తెరలేపింది. అరేబియా సముద్రంలో క్షిపణి పరీక్షలు, అణుబాంబులు వేస్తామని మంత్రులు ప్రకటించడం.. LOC వద్ద కాల్పులకు తెగబడటం.. ఇవన్నీ కూడా దృష్టి మళ్లించే పనులు అనేది క్లియర్గా అర్థమవుతోంది.
మరోవైపు దేశ రాజధాని ఢిల్లీలో పరిణామాలు వేగంగా మారుతున్నాయి. రక్షణశాఖ మంత్రి వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. CDS అనిల్చౌహాన్తో రాజ్నాథ్ ఇప్పటికే సుదీర్ఘ చర్చలు జరిపారు. మరోవైపు చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్తో సమావేశం అయ్యారు. ప్రస్తుతం బోర్డర్లో పరిస్థితిపై ఎప్పటికప్పుడు ఆయన తెలుసుకుంటున్నట్టు తెలుస్తోంది. వరుస భేటీలతో నెక్ట్స్ ఏం జరుగుతుందనే టెన్షన్ అందరిలో నెలకొంది.
ఇండియన్ ఆర్మీ ఇప్పటికే పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇప్పటికే ఆర్మీ, పారామిలిటరీ సిబ్బంది సెలవులు రద్దు అయ్యాయి. సెలవుల్లో ఉన్నవారు కూడా వెంటనే తిరిగి విధుల్లో చేరాలంటూ ఆదేశాలు జారీ చేసింది ఆర్మీ. మరోవైపు వ్యూహాత్మక ప్రాంతాల్లో మోహరింపులు పెరుగుతున్నాయి. వీటన్నింటిని చూస్తుంటే కేంద్రం ఏదో పెద్ద ఎత్తునే వ్యూహ రచన చేస్తున్నట్టు కనిపిస్తోంది.
ప్రధాని నరేంద్ర మోదీ పాక్పై వార్ డిక్లేర్ చేస్తారా? మోదీ సైగ చేస్తే యుద్ధానికి భారత్ సిద్ధంగా ఉండేలా ఏర్పాట్లు కొనసాగుతున్నాయా? అనే ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి. ఓ వైపు ఈ ఏర్పాట్లు కొనసాగుతుండగానే.. దేశంలో ఉన్న పాకిస్థానీలను పంపించే పనులు జోరుగా సాగుతున్నాయి. మూడు రోజుల వ్యవధిలో 537 మంది పాక్ పౌరులు, దౌత్యవేత్తలు అటారీ-వాఘా సరిహద్దు వెంబడి దేశాన్ని వదిలి పాక్కు తిరిగి వెళ్లిపోయినట్టు గణాంకాలు చెబుతున్నాయి.