విశాఖ సిటీలో కూటమి ఎమ్మెల్యేల మధ్య వివాదం నెలకొంది. బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు వర్సెస్ టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు వ్యవహారం హాట్ టాపిక్గా మారింది. ఇద్దరి మధ్యా వాగ్వాదం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఫిలింనగర్ క్లబ్ లీజుకు సంబంధించిన విషయంలో ఇటీవల ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు కలెక్టర్కు లేఖ రాశారు. అయితే ఆ వ్యవహారం ఇద్దరి మధ్యా అగాథం సృష్టించింది. ఫిలింనగర్ క్లబ్ భీమిలి నియోజకవర్గం పరిధిలోకి వస్తుందని.. తనకు తెలియకుండా లీజు వ్యవహారాన్ని కలెక్టర్ దృష్టికి ఎలా తీసుకెళ్లారని విష్ణు కుమార్ పై మాజీ మంత్రి గంటా శ్రీనివాస్ ఫైర్ అయ్యారు. ఈ లీజు వ్యవహారాన్ని కలెక్టర్ దృష్టికీ తీసుకెళ్లే సమయంలో మీరు అందుబాటులో లేరని.. గంటా శ్రీనివాస్కు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు విష్ణు కుమార్ రాజు. అయినా గంటా వినిపించుకోలేదు.
ఇటీవల ఓ కార్యక్రమంలో గంటా శ్రీనివాసరావు, విష్ణుకుమార్ రాజు పాల్గొన్నారు. ఆ సమయంలో గంటా కారులో కూర్చొని సీరియస్గా మాట్లాడుతూంటే.. విష్ణు కుమార్ రాజు కారు పక్కనే నిలబడి సమాధానం చెబుతూ ఉన్నారు. ఈ తతంగం మీడియా కెమెరాల్లో రికార్డయ్యింది. గంటా శ్రీనివాసరావు మాత్రం వినకుండా కేకలు వేస్తూ వాహనంలో కూర్చొని మరింత ఆగ్రహంతో రియాక్ట్ అయ్యారు. ఈ క్రమంలో తోటి నేతలు సర్ది చెప్పే ప్రయత్నం చేయగా.. గంటా అదేం పట్టించుకోకుండా అక్కడి నుంచి వెళ్లిపోయారు.
2014లో విశాఖ ఫిల్మ్ క్లబ్ను ఏర్పాటు చేశారు. సినిమా, సాంస్కృతిక కార్యకలాపాల కోసం ప్రభుత్వం నుండి భూమిని లీజుకు తీసుకున్నారు. ఈ భూమి విలువైన బీచ్ రోడ్డు ప్రాంతంలో ఉండటం వల్ల, దీనిపై రాజకీయ నాయకులు, వివిధ గ్రూపుల దృష్టి పడింది. వైఎస్ఆర్సీపీ హయాంలో క్లబ్ పాలకవర్గం మారిపోయింది. విజయసాయిరెడ్డి కనుసన్నల్లో ఈ వ్యవహారాలు నడిచాయని చెబుతారు. 2024 జూన్లో, క్లబ్లోని “వైఎస్ఆర్ లాన్స్” అనే పేరును క్లబ్ సభ్యులు తొలగించారు. అది వివాదంగా మారింది.
ఈ క్లబ్ లీజు వ్యవహారంలో ఏం జరిగిందో కానీ గంటా శ్రీనివాసరావు మాత్రం.. విష్ణుకుమార్ రాజు జోక్యాన్ని సహించలేదు. ఆయన తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఆ క్లబ్ భీమిలి నియోజవర్గంలోకి రావడమే కాదు.. ఆ క్లబ్ ఏర్పాటులో గంటా శ్రీనివాసరావు కూడా కీలక పాత్ప పోషించారు. అయితే, విష్ణుకుమార్ రాజు క్షమాపణలు చెప్పినందున.. ఈ వ్యవహారం ఇంతటితో సద్దుమణిగిపోయి ఉంటుందని భావిస్తున్నారు.