విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్గా భారీ ఎత్తున ‘కన్నప్ప’ మూవీ రాబోతోంది. అవా ఎంటర్టైన్మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. భారీ బడ్జెట్ కేటాయించి డా.మోహన్ బాబు నిర్మిస్తున్న ఈ మూవీకి ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన పోస్టర్లు, గ్లింప్స్, టీజర్ ఆడియెన్స్లో అంచనాలు పెంచేశాయి. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన రిలీజ్ డేట్ను ప్రకటించారు.
కన్నప్ప రిలీజ్ అయ్యేలోపు పన్నెండు జ్యోతిర్లింగాలను దర్శించుకుంటామని విష్ణు మంచు చెప్పారు. ఈ క్రమంలో ఉజ్జయినీ మహాకాళేశ్వర్ దేవాలయంలో కన్నప్ప విడుదల తేది ప్రకటించారు. కన్నప్ప మూవీని 25 ఏప్రిల్, 2025న భారీ ఎత్తున అన్ని భాషల్లో రిలీజ్ చేయబోతోన్నట్టుగా ప్రకటించారు.
ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో రానున్న ఈ చిత్రానికి హాలీవుడ్ టెక్నీషియన్లు పని చేశారు. అంతర్జాతీయ స్థాయిలో ఈ చిత్రాన్ని రూపొందించారు. న్యూజిలాండ్ అందాలను తెరపై ఆవిష్కరించి.. కన్నప్పతో గ్రాండ్ విజువల్ ట్రీట్ ఇచ్చేందుకు ప్లాన్ చేశారు.
కన్నప్ప చిత్రంలో ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్, శరత్ కుమార్, మధుబాల, దేవరాజ్, ముఖేష్ రిషి, మంచు అవ్రామ్, అర్పిత్ రంకా, బ్రహ్మానందం వంటి మహామహులు నటిస్తున్నారు.