హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల వేళ బీజేపీ బ్యానర్లతో కొడుతోంది. తమకు సంఖ్యా బలం లేక పోయినా ఎన్నికల బరిలో దిగిన బీజేపీ.. ఎంఐఎంతో మైండ్గేమ్ స్టార్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఇటు.. బీఆర్ఎస్ ఓటర్లు పోలింగ్కు దూరంగా ఉండాలని ఇప్పటికే ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించారు. ఇక, కాంగ్రెస్ పార్టీ సహజంగానే మిత్రధర్మంలో భాగంగా ఎంఐఎంకు తమ పార్టీ ఓటర్లు ఓటేస్తారని ప్రకటించింది. కానీ, బీజేపీ పోటీలోకి దిగినప్పటికీ.. అవసరమైన స్థాయిలో వ్యూహాలు రచించలేదని అంటున్నారు.
హైదరాబాద్లో 22 ఏళ్ల తర్వాత స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నిక జరుగుతోంది. అయితే, ఈసారి ఎన్నికల్లో బీజేపీ, ఎంఐఎం ముఖాముఖి తలపడుతున్నాయి. ఓ వైపు మజ్లిస్ కు గెలిచేందుకు అవసరమైన సంఖ్యా బలం ఉన్నప్పటికీ.. విజయం మాత్రం తమదే అని బీజేపీ ధీమా వ్యక్తం చేస్తోంది. అయితే, ఎంఐఎం వర్సెస్ బీజేపీ పోరులో ఫలితం ఎలా ఉండబోతుంది..? ఎంఐఎంను అడ్డుకునేందుకు బీజేపీ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది..? అన్నది ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో పొలిటికల్ హీట్ గా మారింది. ఈ ఎన్నిక ప్రస్తుతం రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది.
అయితే, బీజేపీ అభ్యర్థికి ఓట్లు వచ్చే రీతిలో ఓ వెరైటీ క్యాంపెయిన్ హైదరాబాద్లో కొనసాగుతోంది. ప్రధానంగా జీహెచ్ఎంసీ కార్పొరేటర్ల ఇళ్ల వద్ద, వాళ్లుండే కాలనీల్లో, వీధుల్లో బ్యానర్లు కట్టారు. ఆ బ్యానర్లు ఎవరు కట్టారన్నది వాటిలో లేకపోయినా.. కచ్చితంగా బీజేపీ శ్రేణులు, హిందూ సంఘాలే కట్టాయన్నది స్పష్టంగా అర్థమవుతోంది. ఆ బ్యానర్లలో ఉన్న నినాదాలు చూస్తే.. అదే తెలుస్తోంది. హిందువుల పేరుతో ఆ బ్యానర్లు ఏర్పాటు చేశారు. లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంఐఎంకు అసలు ఓట్లు వేయొద్దని, ఫ్లెక్సీలో రాశారు. అలాగే, బీఆర్ఎస్ కార్పొరేటర్ల ఏరియాల్లో మీరు తప్పకుండా ఓటు వేయాలని, బీజేపీకి ఓటు వేసి హిందూయిజం వైపు నిల్చోవాలని, లేదంటే వచ్చే ఎన్నికల్లో హిందువులం మీకు ఓట్లు వేయబోమని ఆ బ్యానర్లలో రాశారు. బీజేపీ అభ్యర్థికి ఓటు వేయకుంటే వాళ్లంతా హిందూ ద్రోహులే అని కొన్ని బ్యానర్లలో రాయించారు.