- వజ్రాల దొంగలు చోక్సీ, మోడీ వెనక్కి వస్తారా?
- భారత దౌత్యాధికారులు విజయం సాధిస్తారా?
- వజ్రాల వ్యాపారం పేరుతో బ్యాంకు రుణాలు
- పంజాబ్ నేషనల్ బ్యాంక్ కు కుచ్చుటోపీ
- తప్పించుకు తిరుగుతున్న చోక్సీ, నీరవ్ మోడీ
- బెల్జియంలో ఉన్నట్లు అధికారుల థృవీకరణ
- చోక్సీని అరెస్టు చేసినట్లు ప్రకటన
- నేరస్తుల అప్పగింత ఒప్పందం ఫలిస్తుందా?
- కేన్సర్ ట్రీట్ మెంట్ పేరుతో కరీబియన్ దీవుల్లో చోక్సీ
నేరస్తుల అప్పగింత ఒప్పందం ప్రకారం విదేశాలకు పారిపోయిన లేదా విదేశాల్లో స్థిరపడుతున్న నేరగాళ్లందరినీ చట్ట పరంగా సంకెళ్లు వేసి భారత్ కు తీసుకు వచ్చే ప్రక్రియ మొదలైంది. ముంబై అల్లర్ల కేసులో కీలక నిందితుడైన తహావుర్ రాణాను మొన్న అమెరికా నుంచి భారత్ కు తీసుకొచ్చిన అధికారులు ఇప్పుడు మెహుల్చోక్సీని కూడా భారత్ కు రప్పించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. భారత ఇంటర్ పోల్ అధికారుల విన్నపం మేరకు బెల్జియంలో ఉన్న మేహుల్ చోక్సిని అరెస్టు చేసినట్లు తెలుస్తోంది.
వజ్రాల వ్యాపారం పేరుతో బ్యాంకుల్లో కోట్లాది రూపాయలు అప్పు తీసుకుని తిరిగి చెల్లించకుండా విదేశాలకు పారిపోయిన మేహుల్ చోక్సీ,ఆయన మేనల్లుడు నీరవ్ మోడీలను భారత్ కు రప్పించాలని ఎప్పటినుంచో అధికారులు ప్రయత్నిస్తున్నారు. పంజాబ్ నేషనల్ బ్యాంకు నుంచి 13,500 కోట్ల రూపాయలు అప్పు తీసుకుని తిరిగి చెల్లించకుండా వీరు విదేశాలకు పారిపోయారు. లండన్ లో తలదాచుకుంటున్న వీరిద్దరినీ తమకు అప్పగించాలని భారత బృందాలు ఆయా దేశాల అధికార్లను దౌత్య మార్గాల ద్వారా సంప్రదిస్తూనే ఉన్నారు.
అరెస్టు నిజమే…
మెహుల్ చోక్సీని బెల్జియంలో పోలీసులు అరెస్టు చేసినట్లు అతని లాయర్ ధృవీకరించారు. అతగాడిని ప్రస్తుతం జైలులో బంధించారని లాయర్ విజయ్ అగర్వాల్ తెలిపారు. అయితే చోక్సీ అరెస్టును తాము ఖండించామని, భారత్కు అప్పగించరాదని కౌంటర్ పిటిషన్ త్వరలోనే దాఖలు చేస్తామని ఆ లాయర్ చెప్పారు. చోక్సీ తప్పించుకు తిరగడం లేదని, కేన్సర్ వైద్యానికి చికిత్స తీసుకుంటున్నందున విచారణకు హాజరు కాలేదని విజయ్ అగర్వాల్ అంటున్నారు.
పంజాబ్ నేషనల్ బ్యాంక్ కు 13 వేల కోట్ల బాకీ
2018లో పంజాబ్ నేషనల్ బ్యాంకుకు 13 వేల 500 కోట్ల రూపాయల రుణాన్ని ఎగవేసిన కేసులో సీబీఐ, ఎన్ ఫోర్స్ మెంట్ డైరక్టరేట్ చోక్సీ, నీరవ్ మోడీలను అరెస్టు చేయాలని ఎప్పటినుంచో ప్రయత్నిస్తున్నారు. వీరిద్దరితోపాటు సంస్థ మేనేజింగ్ డైరక్టర్ అయిన గీతాంజలి జెమ్స్ లపై పంజాబ్ నేషనల్ బ్యాంక్ క్రిమినల్ కేసులు నమోదు చేసింది. ముంబై బ్రాడీ హౌస్ లోని అధికారులకు లంచాలిచ్చి వీరు, లెటర్స్ ఆఫ్ అండర్ టేకింగ్, ఫారిన్ లెటర్స్ ఆఫ్ క్రెడిట్ కాగితాలను సంపాదించినట్లు నేరారోపణలు నమోదయ్యాయి. పంజాబ్ నేషనల్ బ్యాంకులో ఈ స్కామ్ వెలుగు చూసే కొన్ని వారాల ముందే వీరిద్దరూ విదేశాలకు పారిపోయారు. మేహుల్ చోక్సీ తమ దగ్గర తలదాచుకుంటున్నాడన్న సంగతి తమకు తెలుసునని అతనిపై నిరంతర నిఘా ఉందని బెల్జియం అధికారులు తెలిపారు. ఇలాంటి వ్యక్తిగత అవినీతి కేసులపై తాము దృష్టి సారించబోమని అయినప్పటికీ ఈ కేసుకున్న ప్రాముఖ్యతను, మారుతున్న పరిణామాలను ఎప్పటికప్పుడు గమనిస్తున్నామని అధికారులు తెలిపారు.
మెహుల్ చోక్సీ భార్య ప్రీతీ చోక్సీ జర్మనీ పౌరసత్వం కలిగిన మహిళ కావడంతో అక్కడ రెసిడెన్సీ కార్డు సంపాదించి భార్యతో కలసి అక్కడే ఉంటున్నాడు.ఆంటిగ్వా, బార్బుడా దేశాల పౌరసత్వం కలిగిన చోక్సీ ఆ ద్వీప దేశానికి కేన్సర్ ట్రీట్ మెంట్ కోసం వెళ్లాడని అక్కడనుంచి స్విట్జర్లాండ్ వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నాడని తెలుస్తోంది. 2021 నుంచి ఆంటిగ్వాలో మాయమై మరో కరీబియన్ దీవి డొమినికాకి మారాడు.
పాక్షికంగా ఆస్తుల స్వాధీనం..
2024లో 2,565.90 కోట్ల మేహుల్ చోక్సీ ఆస్తులను స్వాధీనం చేసుకుని వేలం వేసినట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటుకు తెలిపారు.