వివాదాస్పద స్వామి నిత్యానంద చనిపోయారనే వార్తలపై స్పష్టత వచ్చింది. రెండు రోజులుగా నిత్యానంద చనిపోయారని, సజీవ సమాధి అయ్యారంటూ జాతీయ స్థాయిలోనూ ప్రచారం జరిగింది. సోషల్ మీడియాలో అయితే ఓ రేంజ్లో ప్రచారం జరిగింది. అయితే, నిత్యానంద స్వయంగా స్థాపించిన ‘కైలాస’ దేశం ఈ ప్రచారాన్ని ఖండించింది. నిత్యానంద సజీవంగా ఉన్నారని, పూర్తి ఆరోగ్యంతో ఉన్నారని ఒక అధికారిక ప్రకటనలో వెల్లడించింది. అంతేకాదు.. న్యూయార్క్ కాలమానం ప్రకారం ఏప్రిల్ 2వ తేదీన సాయంత్రం 7 గంటలకు నిత్యానంద స్వామి ప్రత్యక్ష ప్రసంగం చేయనున్నారని కూడా ప్రకటించింది.
ఇంతకుముందు, హిందూ ధర్మ పరిరక్షణ కోసం నిత్యానంద ప్రాణ త్యాగం చేశారనే ప్రచారం జరిగింది. నిత్యానంద మేనల్లుడే స్వయంగా వెల్లడించినట్లు అనేక నివేదికలు పేర్కొన్నాయి. నిత్యానంద చనిపోయారని, ఆయన మేనల్లుడు సుందరేశన్ ధృవీకరించినట్లు సోషల్ మీడియా కోడై కూసింది. నిత్యానంద జీవితానికి సంబంధించిన ఎటువంటి అపోహలు ప్రచారం చేయొద్దని ‘కైలాస’ దేశం ప్రజలకు విజ్ఞప్తి చేసింది.