ప్రపంచదేశాలపై టారిఫ్ కత్తీ దూసేందుకు సిద్ధమవుతోంది అమెరికా. ఏప్రిల్ 2న ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతీకార టారిఫ్లను అనౌన్స్ చేయనున్నారు. ప్రపంచంలోని అన్ని దేశాలపై టారిఫ్లను విధిస్తామని.. ముఖ్యంగా కొన్ని దేశాలపై తీవ్రమైన టారిఫ్లు విధించక తప్పదన్నారు ట్రంప్. అయితే ట్రంప్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే దానిపై ప్రపంచ దేశాలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాయి. ట్రంప్ అనౌన్స్మెంట్ తర్వాత చాలా విషయాలు మారడం ఖాయమనే చెప్పాలి. ట్రేడ్ వార్కు ఇది ఆరంభమని కూడా కొందరు నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ట్రంప్ అనౌన్స్మెంట్కు ముందు వైట్హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లివిట్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈయూ, జపాన్, కెనడా, భారత్ను టార్గెట్ చేస్తూ కొన్ని వ్యాఖ్యలు చేశారామే. అమెరికా డెయిరీ ఉత్పత్తులపై యూరప్ 50 శాతం, బియ్యంపై జపాన్ 700 శాతం, వ్యవసాయ ఉత్పత్తులపై భారత్ 100 శాతం, బటర్, చీజ్పై కెనడా 300 శాతం టారిఫ్లు విధిస్తున్నాయని.. ఈ దేశాలన్నింటిపై ప్రతీకార టారిఫ్లు విధిస్తామని చెప్పారామే.
మరి ట్రంప్ ఎలాంటి ప్రకటన చేయబోతున్నారు.. ఏ దేశంపై ఎంత మేర టారిఫ్లు విధిస్తారనేది ఇప్పుడు ఇంట్రెస్టింగ్గా మారింది. ఇప్పటికే గ్లోబల్ పాలిటిక్స్ మారుతున్నాయి. అమెరికా మాకు ఎంత మాత్రం మిత్రదేశం కాదని కెనడా చెబుతోంది.. కొన్ని విషయాల్లో జపాన్, సౌత్ కొరియా, చైనా కలిసి పనిచేయాలని ఓ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. ట్రంప్ తీసుకోబోయే నిర్ణయాలు ట్రేడ్ వార్కు దారి తీయడమే కాదు.. కొన్ని దేశాలను అమెరికాకు దూరం చేయడమే కాదు.. చైనాకు దగ్గరగా చేస్తాయని చెబుతున్నారు.
కానీ ట్రంప్ వర్షన్ మాత్రం మరోలా ఉంది. ఇన్నేళ్లుగా చాలా దేశాలు అమెరికాను దోచుకున్నాయని.. ఇకపై ఈ ఆటలు కొనసాగవని చెబుతున్నారు ఆయన. ఇకపై ఏ దేశం తమపై ఎంత టారిఫ్ విధిస్తే.. తాము కూడా అంతే స్థాయిలో టారిఫ్లు విధిస్తామని చెబుతున్నారు.