కేంద్ర మంత్రి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి హుటాహుటిన హస్తిన బయలు దేరి వెళ్లారు. ఆదివారం హైదరాబాద్లో ఆయనకు షెడ్యూల్డ్ ప్రోగ్రామ్లు ఉన్నప్పటికీ అన్నింటినీ రద్దు చేసుకొని ఢిల్లీ వెళ్లారు. ఈ అంశం ఇప్పుడు బీజేపీలో చర్చనీయాంశం అయ్యింది.
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి మార్పుపై దాదాపు ఆరు నెలలుగా చర్చ జరుగుతోంది. నేడు, రేపు అంటూ.. బీజేపీ అధ్యక్షుడి ప్రకటన వాయిదా పడుతూ వస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇటీవల పలు జిల్లాల బీజేపీ అధ్యక్షులను ఎంపిక చేశారు. ఇక, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడి ప్రకటనే తరువాయి అంటూ.. దాదాపు రెండు నెలలుగా లీకులు వస్తూనే ఉన్నాయి. ఏకంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డే నెల రోజుల క్రితం మీడియాతో మాట్లాడుతూ వారం రోజుల్లోనే బీజేపీ కొత్త అధ్యక్షుడి ప్రకటన వస్తుందని స్పష్టంగా చెప్పారు. కానీ, ఆ వాయిదా కూడా దాటిపోయింది. ఇప్పుడు ఉన్నట్టుండి కార్యక్రమాలను రద్దు చేసుకొని మరీ కిషన్ రెడ్డి ఢిల్లీ వెళ్లారంటే దీని వెనుక అధ్యక్షుడి ప్రకటనే అయి ఉంటుందన్న చర్చ జోరుగా సాగుతోంది.
ముందుగా షెడ్యూల్ చేసుకున్న ప్రోగ్రాం ప్రకారం కిషన్ రెడ్డి.. సికింద్రాబాద్లో బిహారీ దినోత్సవ వేడుకల్లో పాల్గొనాల్సి ఉంది. అయితే, హస్తిన నుంచి పిలుపు రాగానే.. మధ్యాహ్నమే కిషన్ రెడ్డి ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు.
కిషన్ రెడ్డి ఢిల్లీ వెళ్లడంపై పార్టీ క్యాడర్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. ఇప్పటికే బీజేపీ అగ్రనేతలు రాష్ట్ర అధ్యక్షుడి ఎంపికపై అభిప్రాయ సేకరణ పూర్తి చేశారు. తెలంగాణ బీజేపీ నేతలతో ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా విడివిడిగా భేటీ అయి అభిప్రాయాలు తీసుకున్నారు.