వర్గీకరణ విషయంలో సీయంను అభినందించిన ఎస్సీ సంఘాలు
వర్గీకరణ చేయడం ద్వారా ఎస్సీలకు న్యాయం చేయాలనేదే మా ప్రభుత్వ ఉద్దేశమని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టి ఆమోదింప చేసినందుకు తెలంగాణలో ఎస్సీ సంఘాలు బుధవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అసెంబ్లీ కమిటీ హాల్లో సన్మానించాయి. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ వర్గీకరణ విషయంలో భవిష్యత్తులో న్యాయపరమైన చిక్కులు ఉండకూడదనే వన్ మేన్ కమిషన్ ఏర్పాటు చేశామని సీయం తెలిపారు. వన్ మ్యాన్ కమిషన్ 199 పేజీల నివేదిక ఇచ్చిందని దాని ఆధారంగానే ఎస్సీలను మూడు గ్రూపులుగా విభజించి రిజర్వేషన్లు కల్పించామని సీయం వివరించారు. పదేళ్ళలో పరిష్కారం కాని సమస్యకు మేము అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే పరిష్కారం చూపామని సీయం చెప్పారు. ఆనాడు వర్గీకరణకు అసెంబ్లీలో తీర్మానం పెట్టాలని డిమాండ్ చేస్తే మమ్మల్ని సభ నుంచి సస్పెండ్ చేశారని సీయం గుర్తు చేశారు. సుప్రీం తీర్పును దేశంలో ఏ రాష్ట్రం అమలు చేయలేదని కానీ తెలంగాణ రాష్ట్రంలో మేము అమలు చేసి ప్రక్రియ మొదలు పెట్టామన్నారు. వందేళ్లలో ఎప్పుడూ లేని విధంగా ఉస్మానియో యూనివర్శిటీ వీసీగా మాదిగ బిడ్డ కుమార్ ని నియమించామని, ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపాల్ గా ప్రొఫెసర్ ఖాసీంని నియమించడమే కాకుండా ఉన్నత విద్యామండలి, పబ్లిక్ సర్వీస్ కమీషన్, విద్యా కమిషన్ లలో మాదిగలకు ప్రాధాన్యం ఇచ్చామని తెలిపారు. ఈ అవకాశాన్ని నిలబెట్టుకుంటేనే భవిష్యత్తులో మరిన్ని అవకాశాలు వస్తాయన్న సీయం ఇది పది మందికి ఉపయోగపడేలా చూడాలని సూచించారు. కుర్చీలో మీ వాడిగా నేనున్నా… మీకు మంచి చేయడమే తప్ప నాకు మరో ఆలోచన లేదు, ఆవేశం తగ్గించుకుని ఆలోచనతో పనిచేయమని సీయం ఎస్సీ సంఘాల ప్రతినిధులను కోరారు. మీ ధన్యవాదాలు నాకు మాత్రమే కాదు మన నాయకుడు రాహుల్ గాంధీకి కూడా తెలియజేయాలని… రాహుల్ గాంధీ లేకపోతే వర్గీకరణ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే శక్తి నాకు వచ్చేది కాదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.