మాములుగా స్పేస్లో ఉండి వచ్చే ఆస్ట్రోనాట్స్కు చాలా సమస్యలు వస్తాయి. అయితే కాలం మారుతున్న కొద్ది వాటి నుంచి బయటపడతారు. కానీ ఈసారి సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ల పరిస్థితి కాస్త భిన్నం. ఎందుకంటే వారు కేవలం 8 రోజుల మాత్రమే ఉండేందుకు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కు వెళ్లారు. కానీ ఏకంగా 9 నెలల పాటు ఉన్నారు. ఇప్పుడీ ఎఫెక్ట్ వారిపై చాలా కాలం ఉంటుందని అంతరిక్ష నిపుణులు చెబుతున్నారు.
అసలు గురుత్వాకర్షణ అనేదే ఉండని స్పేస్లో 9 నెలల పాటు గడిపారు. ఇప్పుడు వారు భూమి మీదకు చేరుకున్న తర్వాత వారిపై గ్రావిటీ చూపించే ఎఫెక్ట్ అంతా ఇంతా కాదు. ఇప్పటికే వారి ఎముకలు, కండరాల సాంద్రత తగ్గిపోయి ఉండొచ్చు. దీంతో నడవడానికి కూడా ఇబ్బందులు తప్పవు. అంతేకాదు వారి కంటిచూపుపై కూడా ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది. ఇవన్నీ సర్దుకోవడానికి కొన్ని వారాల సమయం తప్పక పడుతుంది.
స్పేస్లో ఎక్కువకాలం ఉండటం వల్ల.. వారి పాదాల్లో దళసరిగా ఉండే చర్మం కోల్పోతారు. దీంతో పసిపిల్లల్లో ఉండేంత మృదువుగా వారి పాదాలు తయారవుతాయి. దీని వల్ల నడవడం కష్టంగా మారుతుంది. రేడియోధార్మికత కారణంగా తెల్లరక్తకణాలు తగ్గిపోతాయి. ఇది వారి రోగనిరోధక శక్తిపై ఎఫెక్ట్ చూపిస్తుంది.
స్పేస్లో గురుత్వాకర్షణ శక్తి లేకపోవడం వల్ల రక్తం, ఇతర ద్రవాలు శరీరంలోని పైభాగంగా ఎక్కువ రక్తం, ద్రవం పేరుకుపోతాయి. ఇది వినికిడి సమస్యకు దారి తీస్తుంది. అంతేకాదు వారి గుండె ఆకృతి కూడా మారుతుంది. రక్తనాళాలు కుచించుకోపోయే ప్రమాదం ఉంది. దీని వల్ల బీపీ పెరుగుతుంది.
స్పేస్ సిక్నెస్ వచ్చే ప్రమాదం కూడా ఉంది. దీనివల్ల కళ్లు తిరగడం, తలనొప్పి, వాంతులు అయ్యే ప్రమాదం ఉంది. కండరాలు చాలా బలహీనపడతాయి. మాములుగా 6 నెలలు స్పేస్లో ఉంటే 30 శాతం కండరాలు బలహీనపడతాయి. సునీత, విల్మోర్లో 9 నెలల పాటు ఉన్నారు. దీంతో వారి కండరాల పరిస్థితి ఇంకొంచెం ప్రమాదకరంగానే ఉంటుంది.
అయితే ఇవేవి కూడా శాశ్వతం కాదు. జస్ట్ వీరంతా భూమిపై ఉండేందుకు అలవాటు పడితే చాలు. చాలా సమస్యలు వాటంతట అవే పరిష్కారమవుతాయి. శరీరం ఒక్కసారి గ్రావిటీకి అలవాటు పడితే చాలు. దీనికి కొన్ని వారాల సమయం పడుతుంది. ఒక్కొక్కరి శరీరాన్ని బట్టి ఎంత సమయం పడుతుందనేది ఉంటుంది. అప్పటి వరకు వీరంతా డాక్టర్ల అబ్జర్వేషన్లో ఉంటారు అంతే.